హైదరాబాద్, అక్టోబర్ 6 (నమస్తే తెలంగాణ): సింగరేణిలో త్రిబుల్ ధమాకా మోగింది. కార్మికులకు లాభాల్లో వాటాతోపాటు, దసరా అడ్వాన్స్, దీపావళి బోనస్ ప్రకటించారు. 2020-21 ఆర్థిక సంవత్సరానికి సింగరేణికి వచ్చిన లాభాల్లో కార్మికులు, ఉద్యోగులకు ఇవ్వాల్సిన లాభాల వాటాను ముఖ్యమంత్రి కేసీఆర్ 29 శాతంగా నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ మేరకు బుధవారం సింగరేణి సీఎండీ ఎన్ శ్రీధర్ లాభాల వాటాతోపాటు, పండుగ అడ్వాన్స్, దీపావళి బోనస్లను ప్రకటించారు. మూడూ కలిపి ఒక్కో కార్మికుడికి సగటున ఒక లక్షా పదిహేను వేల రూపాయలు అందనున్నాయి. ఈ ఏడాది లాభాల్లో 29 శాతం వాటాకింద మొత్తం రూ.79.07 కోట్లు చెల్లించనున్నారు. ఈ మొత్తాన్ని ఈ నెల 11న చెల్లించనున్నట్టు సీఎండీ శ్రీధర్ ప్రకటించారు. పండుగ అడ్వాన్స్ కింద రూ.25 వేల చొప్పున ఈ నెల 8న కార్మికుల ఖాతాల్లో జమచేయనున్నారు. దీపావళి బోనస్గా ఒక్కో కార్మికుడికి రూ.72,500 చొప్పున అందనున్నాయి. దీన్ని నవంబర్ 1న అందించనున్నారు. లాభాల వాటా, దీపావళి బోనస్ కలిపి సంస్థ మొత్తం రూ.379.07 కోట్లను కార్మికులకు అందించనున్నది. సింగరేణి యాజమాన్యం ప్రకటించిన త్రిబుల్ ధమాకాతో సింగరేణిలో ముందుగానే పండుగ వాతావరణం నెలకొన్నది. కార్మికులు, ఉద్యోగులు సంబురాల్లో మునిగిపోయారు. ఒక్కో కార్మికుడికి సగటున రూ.1.15 లక్షలు అందనుండటంతో ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. సంస్థ పరిధిలో దాదాపు 43 వేల మంది కార్మికులు, 2,300 మంది అధికారులున్నారు. వీరందరికీ లాభాల్లో వాటా మొత్తాన్ని అందించనున్నారు.
భారతదేశంలో ఏ బొగ్గు సంస్థలోనూ లాభాల్లో వాటాను కార్మికులు, ఉద్యోగులకు పంచే సంప్రదాయం లేదు. సింగరేణిలో మాత్రమే ప్రతిఏటా లాభాల్లో కార్మికులకు వాటా ప్రకటిస్తారు. దేశానికి ఇంధనంగా వాడే బొగ్గును వెలికితీయడంలో సింగరేణి కార్మికులు, ఉద్యోగుల శ్రమకు ఇది ప్రత్యేక గౌరవంగా భావిస్తారు. తెలంగాణ వచ్చాక ప్రభుత్వం లాభాల్లో వాటాను గణనీయంగా పెంచింది.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డాక సింగరేణి లాభాల్లో వాటాను ఏటా పెంచుతూ వస్తున్నారు. దీంతో కార్మికులకు భారీగా నగదు అందుతున్నది. ఉత్పత్తి, రవాణా, ఓబీ తొలగింపుపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణతోపాటు, కార్మికులు నిరంతరం శ్రమిస్తూ నిర్దేశించుకున్న లక్ష్యాల మేరకు పనిచేస్తున్నారు. దీంతో ఏటా లాభాలతోపాటు, ఉద్యోగులకు అందే వాటా కూడా పెరుగుతూ వస్తున్నది. 2020-21లో కరోనా కారణంగా ఉత్పత్తిపై ప్రభావం పడటంతో తక్కువ లాభాలు వచ్చాయి. పన్నులన్నీ మినహాయించాక రూ.272.64 కోట్ల లాభం మాత్రమే తేలింది. అయినప్పటికీ సీఎం కేసీఆర్ సంస్థ లాభాల్లో గతేడాది కంటే ఒక శాతాన్ని పెంచుతున్నట్టు ప్రకటించారు. కరోనా నుంచి కోలుకుని.. ఈ ఏడాది భారీ లాభాల దిశగా సింగరేణి పరుగులు పెడుతున్నది. లాభాల్లో వాటాను 29 శాతానికి పెంచుతూ సీఎం కేసీఆర్ నిర్ణయించడంపై సీఎండీ శ్రీధర్ ఉద్యోగుల తరఫున ధన్యవాదాలు తెలిపారు.