హైదరాబాద్, సెప్టెంబర్ 21 (నమస్తే తెలంగాణ): సింగరేణి సంస్థలో జూనియర్ అసిస్టెంట్ గ్రేడ్-2 పోస్టుల భర్తీ ప్రక్రియను కొనసాగించేందుకు హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం అనుమతి ఇచ్చింది. ఉద్యోగాల భర్తీ కోసం ఏడాది క్రితం నిర్వహించిన పరీక్షను రద్దు చేస్తూ ఇటీవల సింగిల్ బెంచ్ జడ్జి ఇచ్చిన తీర్పును పక్కనబెట్టింది. సింగరేణిలో 177 జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీ కోసం 2022 సెప్టెంబర్ 4న జేఎన్టీయూహెచ్ ఆధ్వర్యంలో ఆన్లైన్ పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షకు 77,907 మంది హాజరుకాగా వీరిలో 49, 328 మంది అభ్యర్థులు కనీస అర్హత మార్కులు సాధించారు.
ఈ పరీక్షను రద్దు చేయాలని కోరుతూ కొంతమంది హైకోర్టును ఆశ్రయించారు. వాదనలు విన్న సింగిల్బెంచ్ జడ్జి.. ఈ పరీక్షను రద్దు చేసి, తిరిగి నిర్వహించాలని సింగరేణి సంస్థను ఆదేశిస్తూ తీర్పు చెప్పారు. దీనిని సవాల్ చేస్తూ సింగరేణి సంస్థతోపాటు మరికొందరు అభ్యర్థులు ద్విసభ్య ధర్మాసనాన్ని ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన జస్టిస్ అభినంద్కుమార్ షావిలి, జస్టిస్ అనిల్కుమార్తో కూడిన ద్విసభ్య ధర్మాసనం గురువారం తీర్పు వెలువరించింది. ఏడాది క్రితం నిర్వహించిన పరీక్ష ఫలితాల ఆధారంగా అర్హులైన అభ్యర్థులను ఉద్యోగాల్లో నియమించే ప్రక్రియను సింగరేణి సంస్థ కొనసాగించవచ్చని స్పష్టంచేసింది.
హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పును సింగరేణి డైరెక్టర్ ఎన్ బలరామ్ స్వాగతించారు. అతి త్వరలోనే నియామక ప్రక్రియను పూర్తి చేస్తామని తెలిపారు. ఈ కేసులో సింగరేణి తరఫున బలంగా వాదనలు వినిపించిన స్పెషల్ గవర్నమెంట్ ప్లీడర్ సంజీవ్కుమార్ (ఆఫీస్ ఆఫ్ అడిషనల్ ఏజీ), సింగరేణి స్టాండింగ్ కౌన్సిల్ హర్షారెడ్డి, సింగరేణి న్యాయ విభాగం అధికారులను అభినందించారు.