హైదరాబాద్, అక్టోబర్ 5 (నమస్తే తెలంగాణ): సింగరేణి కార్మికులకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు దసరా బొనాంజా ప్రకటించారు. సంస్థ ఆర్జించిన లాభాల్లో కార్మికులకు 29% వాటా ఇవ్వాలని నిర్ణయించారు. గతేడాది కంటే ఒకశాతం వాటాను అధికంగా పెంచారు. వీటిని దసరా కంటే ముందే చెల్లించాలని సీఎండీ ఎన్ శ్రీధర్ను ఆదేశించారు. మంగళవారం ప్రగతిభవన్లో సింగరేణిపై నిర్వహించిన సమీక్షలో కేసీఆర్ మాట్లాడుతూ.. సింగరేణి కార్మికుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని పునరుద్ఘాటించారు. కార్మికుల భవిష్యత్తు దృష్ట్యా బొగ్గు తవ్వకంతోపాటు ఇసుక, ఇనుము, సున్నపురాయి తదితర ఖనిజాల తవ్వకాల్లోకి సింగరేణి విస్తరించాలని ఆకాంక్షించారు. బొగ్గుగని మైనింగ్, పవర్ జనరేషన్ నిర్వహణలో సింగరేణిని దేశంలోనే ఉన్నతస్థానంలో నిలపడంలో కార్మికుల శ్రమ, నైపుణ్యం ఎంతో గొప్పదని కొనియాడారు. నిబద్ధతతో నిరంతరం శ్రమచేస్తున్న సింగరేణి కార్మికుల సంక్షేమం, భవిష్యత్తు కోసం తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని చెప్పారు. కార్మికుల నైపుణ్యాన్ని ఇసుక, సున్నపురాయి, ఇనుము తదితర ఖనిజాల తవ్వకాల్లోనూ వినియోగించుకోవాల్సిన సందర్భం వచ్చిందని తెలిపారు. ఇందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.
సింగరేణి సంస్థలో రిటైర్డ్ కార్మికులు, ఉద్యోగులకు కేంద్రప్రభుత్వ సంస్థ ద్వారా అందుతున్న పింఛన్ రెండువేలలోపే ఉన్నదని, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏదైనా సాయం చేసేందుకు చర్యలు చేపట్టాలని మంత్రి కొప్పుల ఈశ్వర్ చేసిన విజ్ఞప్తికి సీఎం సానుకూలంగా స్పందించారు. రాష్ట్రప్రభుత్వం ఎటువంటి చర్యలు చేపట్టడం ద్వారా సింగరేణి రిటైర్డ్ కార్మికులు, ఉద్యోగులకు సాయం చేయగలమో నివేదికను తయారుచేయాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎంపీ వెంకటేశ్ నేతకాని, ఎమ్మెల్యేలు రేగా కాంతారావు, వనమా వెంకటేశ్వర్రావు, దివాకర్రావు, గండ్ర వెంకటరమణారెడ్డి, హరిప్రియనాయక్, దుర్గం చిన్నయ్య, ఆత్రంసకు, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ నర్సింగ్రావు, సింగరేణి సీఎండీ ఎన్ శ్రీధర్, తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం (టీబీజీకేఎస్) రాష్ట్ర అధ్యక్షుడు బీ వెంకట్రావు, ప్రధాన కార్యదర్శి రాజిరెడ్డి, సంఘం నాయకుడు మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.
‘ప్రైవేట్ కార్పొరేట్ కంపెనీలవాళ్లు రిటైరయిన సింగరేణి కార్మికులను వినియోగించుకుని ఖనిజాల తవ్వకాలను నిర్వహిస్తూ లాభాలు గడిస్తున్నారు. మనమే ఎందుకు ఆ పని చేయకూడదు? లాభాలు వచ్చే అవకాశమున్న ప్రభుత్వరంగ సంస్థలను కేంద్ర ప్రభుత్వం ప్రైవేట్పరం చేస్తుండటం శోచనీయం. తెలంగాణ ప్రభుత్వం సింగరేణి కార్మికుల సంక్షేమాన్ని, సంస్థ మనుగడను దృష్టిలో ఉంచుకుని పనిచేస్తున్నది. వారి నైపుణ్యాన్ని, శక్తిని తప్పకుండా వినియోగించుకుంటాం. బొగ్గుతోపాటు రాష్ట్రంలో నిల్వలున్న ఇతర మైనింగ్రంగాలను నిర్వహిస్తూ కార్మికులకు పని కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వమే స్వయంగా చర్యలు చేపడుతుంది’ అని సీఎం కేసీఆర్ స్పష్టంచేశారు.