హైదరాబాద్ : పెద్దపల్లి జిల్లాలోని రామగుండం ఏరియాలో మెడికల్ కాలేజీ ఏర్పాటుకు టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. మెడికల్ కాలేజీ ఏర్పాటుకు సింగరేణి సంస్థ నిధులు మంజూరు చేయాలని సీఎం కేసీఆర్ ఇటీవల జరిగిన ప్రత్యేక సమావేశంలో సూచించారు. ఈ క్రమంలో మెడికల్ కాలేజీ ఏర్పాటుకు రూ. 500 కోట్లను మంజూరు చేస్తూ సింగరేణి సంస్థ నిర్ణయం తీసుకుంది. సింగరేణి సంస్థ ఛైర్మన్, ఎండీ శ్రీధర్ ప్రత్యేక చొరవతో ఈ నెల 10వ తేదీన జరిగిన బోర్డు ఆఫ్ డైరెక్టర్ల సమావేశంలో మెడికల్ కాలేజీకి రూ. 500 కోట్ల కేటాయింపునకు ఆమోదం లభించింది. కొత్తగూడెంలో జరిగిన చారిత్రాత్మక సింగరేణి 100వ వార్షిక సర్వ సభ్య సమావేశం ఈ నిధుల కేటాయింపునకు తన అంగీకారం తెలిపింది. దీంతో రామగుండం ఏరియాలో మెడికల్ కాలేజీ, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఏర్పాటుకు మార్గం సుగమమైంది.
సింగరేణి నిధులతో ఏర్పాటు చేసే ఈ వైద్య కళాశాల, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో హైదరబాద్ వంటి పట్టణాల్లో లభించే అన్ని రకాల సూపర్ స్పెషాలిటీ వైద్య విభాగాలను ఏర్పాటు చేసి వైద్య సేవలు అందజేయనున్నారు. మెడికల్ కాలేజీ, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి అందుబాటులోకి వస్తే.. సింగరేణి కార్మికులు, రిటైర్డ్ కార్మికులతో పాటు పెద్దపల్లి, మంచిర్యాల, భూపాలపల్లి, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందనున్నాయి. ఈ నిర్మాణాలు రెండేండ్లలో పూర్తి కానున్నాయి.
ఈ సందర్బంగా ముఖ్యమంత్రి కేసీఆర్కు సింగరేణి కార్మికులు, ఉద్యోగుల తరపున ఆ సంస్థ సీఎండీ శ్రీధర్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. సింగరేణి ఉద్యోగులు, కార్మికుల దశాబ్దాల కల త్వరలోనే సాకారం కానుందన్నారు. ఇటువంటి సమాజహిత కార్యక్రమాల్లో సింగరేణి సంస్థకు పాలుపంచుకునే అవకాశం లభించడం పట్ల శ్రీధర్ సంతోషం వ్యక్తం చేశారు.