అడ్డుకొన్న రెవెన్యూ సిబ్బంది
బంజారాహిల్స్, ఫిబ్రవరి 26: బంజారాహిల్స్ రోడ్ నంబర్ 3లో సీ నారాయణరెడ్డి భవన్ నిర్మాణానికి ప్రభుత్వం కేటాయించిన స్థలాన్ని కొందరు కబ్జాకు యత్నించారు. షేక్పేట మండలం సర్వే నంబర్ 403లోని టీఎస్ నెం 4/1/1/, బ్లాక్-డి, వార్డు 10లో సుమారు 3,050 గజాల ప్రభుత్వ స్థలాన్ని 2018లో తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖకు ప్రభుత్వం అప్పగించింది. ఈ స్థలంలో ప్రముఖ కవి డాక్టర్ సీ నారాయణరెడ్డి పేరుతో సాహిత్య భవన్ను నిర్మించాలని నిర్ణయించింది. రెండేండ్ల క్రితం మంత్రి కేటీఆర్ చేతులమీదుగా శంకుస్థాపన కూడా చేశారు. కరోనా కారణంగా భవన నిర్మాణ పనులు ప్రారంభం కాలేదు. శనివారం కొంతమంది వచ్చి ఈ స్థలంపై తమకు డెవలప్మెంట్ హక్కులు ఉన్నాయంటూ ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. రూ.60 కోట్ల విలువ చేసే ఈ స్థలాన్ని గుర్తుతెలియని వ్యక్తులు కబ్జా చేసేందుకు వచ్చారని స్థానికులు షేక్పేట తహసీల్దార్ శ్రీనివాస్రెడ్డికి సమాచారం ఇచ్చారు. రెవెన్యూ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని ఫెన్సింగ్ను తొలగించారు. ఈ స్థలం ప్రభుత్వానిదేనని, ప్రైవేటు వ్యక్తులకు సంబంధం లేదని తహసీల్దార్ తెలిపారు. ఈ స్థలం వెనకాల ఉన్న సుమారు 500 గజాల ఖాళీ ప్రభుత్వ స్థలాన్ని కూడా ఆక్రమించేందుకు యత్నించారని, దానిని కూడా స్వాధీనం చేసుకొన్నామని తహసీల్దార్ వెల్లడించారు.