Valmidi | జనగామ జిల్లా పాలకుర్తి మండలం వల్మిడి రాములోరి గుట్టపై శాతవాహనుల కాలం నాటి ఆనవాళ్లు బయటపడ్డాయి. విదేశాలతో శాతవాహనులకు వాణిజ్య సంబంధాలు ఉన్నట్లు గుర్తించినట్లు చరిత్ర పరిశోధకుడు, రచయిత రెడ్డి రత్నాకర్రెడ్డి తెలిపారు. శనివారం వల్మిడి గుట్టను సందర్శించి వాల్మీకి గుట్ట, మునుల గుట్ట, పెద్దమ్మ బండ కేంద్రంగా 3వేల ఏళ్ల కాలం కిందటి సుసంపన్నమైన బృహత్ శిలాయుగం, శాతవాహనుల కాలం నాటి సంస్కృతి విలసిల్లిందని చెప్పేందుకు అనేక ఆధారాలను గుర్తించారు. రామాలయం ఉన్న గుట్ట నుంచి మంచుప్పుల వెళ్లే దారికి రెండు వైపుల గుట్టల దిగువన విశాలమైన పాటి మీద దుబ్బ అని పిలిచే ప్రాంతం ఉంది. రాముడి గుట్టను మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతున్న క్రమంలో ఎత్తయిన రోడ్డు మార్గం వేయడానికి రెండు వైపుల కందకాలు తీశారు.
ఈ కందకాల్లో రోడ్డుకి రెండు వైపుల ఉన్న వ్యవసాయ భూముల్లో అనేక మృణ్మయ పాత్రలు (మట్టిపాత్రలు) ఉపరితంలో కనిపించాయి. శాతవాహనులు తెలంగాణతో పాటు దక్షిణ భారతదేశంలో విశాల సామ్రాజ్యాన్ని స్థాపించారు. క్రీస్తుపూర్వం ఒకటి, రెండు శతాబ్దాల నాటికే రోమన్లతో వర్తకవాణిజ్య సంబంధాలు నెరిపినట్లుగా తెలుస్తోంది. జనగామ జిల్లాలోని అనేక గ్రామాల్లో శాతవాహనుల కాలం నాటి ఇటుకలు లభించాయి. వల్మిడి పాటిమీద కూడా పెద్ద పెద్ద ఇటుకలతో పాటు గృహ అవసరాల కోసం అలంకారం కోసం ఉపయోగించే రౌలెటెడ్ వేర్ అని పిలుచుకునే రోమన్ పాత్రలు పిల్లల కోసం ఆడుకునే చేతిలో ఇమిడే చిన్న చిన్న మట్టికుండలు ఎరుపు ముదురు ఎరుపు నలుపు బూడిద రంగుల్లో అనేక డిజైన్లు ఉన్న మట్టిపాత్రలు ధాన్యం నిలువ కోసం ఉపయోగించే గాబులు బయటపడ్డాయి.
పసి పిల్లలకు పాలు తాగించే రంధ్రం ఉన్న మట్టి పాత్రలు, నాణ్యత లోపించిన మట్టిపూసలు, చేత్తో చేసి కాల్చిన ఎద్దు బొమ్మలు, నాలుగు కాళ్ల రాతి పీటలు, రాతి గొడ్డల్లు, ఇనుపరాతి పనిముట్లు, ఇటుకలు, మట్టిబిల్లలు, సున్నపు రాళ్ల ముక్కలు లభించాయి. గుట్టకు వేళ్లే దారిలో ఎడమ వైపు రోడ్డు నుంచి ఎర్ర చెరువు మత్తడి వాగు, తునికాకు బండ వరకు చిట్టెపు రాళ్లు, ఇనుప ముక్కలతో నేల ఉపరితలం కప్పబడి ఉంది. ఇనుప రాతి నుంచి ఇనుమును తీసి ఇనుము లేదా ఉక్కు ముద్దలు చేయడానికి కుమ్మరి కోలుములు ఉన్నట్లు గుర్తించారు. ఇనుము, ఉక్కు ముద్దలు పెద్ద ఎత్తున ఎగుమతి చేసే వారని తెలుస్తోంది. పాటిమీద లభిస్తున్న పెబల్ రకపు రాళ్లతో పాటు బీరప్ప గుడిలో పూజించబడుతున్న లింగాలు ఆ కాలం నాటివే. చదవడం రాయడం తెలియని చరిత్ర పూర్వయుగం నుంచే వల్మిడి గుట్టలో మానవ నాగకరికత ప్రారంభమైంది. ఇక్కడి ప్రజలు అలంకార ప్రియులు. భోజన ప్రియులు.
వల్మిడి పూర్వపు పేరు గుల్మిడి. రామాయణం రాసిన వాల్మీకి పేరుతో వల్మిడి అనే గ్రామ నామం స్థిరపడిందని స్థానికులు చెబుతున్నారు. కానీ, చారిత్రక ఆధారాలు ఏమీ లభించలేదు. శాతవాహనుల కాలంలో ఐదు గ్రామాలను కలిపి గుల్మి అంటారు. గుల్మి అధిపతిని గుల్మికుడు అంటారు. నాటి గుల్మిడి నేటి వల్మిడిగా ప్రసిద్ధి చెందవచ్చని పరిశోధకులు భావిస్తున్నారు. ముందుగా చారిత్రక వల్మిడి ప్రాంతంలో పురవస్తు శాఖ అధికారులు త్రవ్వకాలు జరిపితే చరిత్ర మరింత వెలుగులోకి రానున్నది. ఇక్కడ బయటపడిన వస్తు సామగ్రిని భద్ర పరిచి పర్యాటక కోసం మ్యూజియం ఏర్పాటు చేసి భద్ర పరచాలని, వల్మిడి గుట్టపైనా రాక్షసగుల్లు, మూడు డోల్మాన్ సమాధులు, ద్వివలయ రాక్షసగుళ్లు ఉన్నాయని పరిశోధకుడు రవీందర్రెడ్డి తెలిపారు.