ఎల్బీనగర్, జనవరి 22: విశ్వనగర హంగులతో ఎల్బీనగర్లో వాసవీ గ్రూపు ఆధ్వర్యంలో అతిపెద్ద గేటెడ్ కమ్యూనిటీ ‘ఆనంద నిలయం’ అందుబాటులోకి వచ్చింది. ఆదివారం వాసవీ గ్రూపు చైర్మన్, సీఎండీ ఎర్రం విజయ్కుమార్తో పాటు ప్రముఖ సినీ ప్రముఖులు శ్రీలీల, అనుపమ పరమేశ్వరన్, సిద్ధు జొన్నలగడ్డ చేతుల మీదుగా ఆనంద నిల యం ప్రారంభమైంది. ఈ సందర్భంగా విజయకుమార్ మాట్లాడుతూ.. వాసవీ గ్రూపు కీర్తికిరీటంలో తాజా కలికితురాయి ఆనంద నిలయమని చెప్పారు. అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ నగరంలో అందాలు కూడా అంతే వేగంగా మారుతున్నాయని పేర్కొన్నారు.
ఆనంద నిలయం 100కు పైగా ప్రపంచ శ్రేణి సౌకర్యాలను కలిగి ఉన్నదని వివరించారు. 29.3 ఎకరాల విస్తీర్ణంలో 11 టవర్లు, 33 అంతస్థులు కలిగిన గేటెడ్ కమ్యూనిటీలో 8.5 చదరపు మిలియన్ చదరపు అడుగుల ఆవాస స్థలం ఉన్నదని చెప్పారు. నిలయంలో 3576 అపార్ట్మెంట్లతో పాటు 2, 3, 4 బీహెచ్కే అపార్ట్మెంట్ల రూపంలోనే కాకుండా స్కై, విల్లాల రూపంలోనూ ఉన్నాయని అన్నారు. విశ్వనగర రూపకల్పనలో తాము అతిపెద్ద భాగస్వామిగా ఉంటామని తెలిపారు.
పలువురు ప్రముఖుల హాజరు
ఆనంద నిలయం ప్రారంభోత్సవానికి ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్ గుప్తా, పోలీస్ హౌజింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ గుప్తా, తెలంగాణ టూరిజం కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్తో పాటు పలువురు హాజరయ్యారు. సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటలు అలరించాయి.