సిద్దిపేట, ఫిబ్రవరి 24 : దక్షిణ భారత దేశానికి ధాన్యాగారంగా తెలంగాణ ఎదిగి దేశ ప్రజలకు బువ్వ పెడుతున్నదని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. రాష్ట్రంలో భూమికి బరువయ్యే విధంగా పంటలు పండుతున్నాయని తెలిపారు. శుక్రవారం సిద్దిపేటలోని 4వ వార్డులో యూనియన్ బ్యాంక్ ఆధ్వర్యంలో నిర్మించనున్న గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ నూతన భవన నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. సిద్దిపేట శివారులోని పొన్నాల వద్ద రాజీవ్ రహదారిపై రూ.24 కోట్ల వ్యయంతో కిలోమీటర్ మేర నిర్మించిన ైఫ్ల్లైఓవర్ను ప్రారంభించారు. పాలమాకుల గ్రామంలో శంభు దేవాలయ పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన, బాలాలయంలో విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ వేలేటి రోజా రాధాకృష్ణ శర్మతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ.. వ్యవసాయ రంగంలో తెలంగాణ అద్భుతమైన ప్రగతి సాధించిందని తెలిపారు.
సీఎం కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించడంతో తెలంగాణలో పుష్కలంగా నీరు అందుబాటులోకి వచ్చిందని, గోదావరి జలాలతో కరువు అన్నదే ఉత్పన్నం కాదని చెప్పారు. వర్గల్ ఫుడ్ పార్క్లో దక్షిణ భారత దేశంలోనే అతిపెద్ద రైస్ మిల్ నిర్మాణం జరుగుతున్నదని తెలిపారు. గోదావరి జలాలతో వేసవిలోనూ చెరువులు, చెక్డ్యామ్లు నిండుగా కనిపిస్తున్నాయని చెప్పారు. ఎనిమిదేండ్ల క్రితం వ్యవసాయమంటే దండగ అనే ధోరణి ఉండేదని, ఇప్పుడు వ్యవసాయమంటే ఓ పండుగలా మారిందని హరీశ్రావు తెలిపారు. నాడు తీవ్ర కరువు పరిస్థితులను ఎదుర్కొన్న తెలంగాణలో ప్రస్తుతం ఎటూ చూసినా రోడ్లకు ఇరువైపులా పచ్చని పొలాలు దర్శనమిస్తున్నట్టు చెప్పారు.