TSRTC | సిద్దిపేట జిల్లా కేంద్రం నుంచి మహారాష్ట్రలోని సోలాపూర్కు ఆర్టీసీ సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి. సిద్దిపేట బస్ డిపోలో రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్రావు మూడు డీలక్స్ బస్సులను జెండా ఊపి ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ.. సిద్దిపేట నుంచి సికింద్రాబాద్, జహీరాబాద్, హుమ్నాబాద్, ఉమర్గా, నాల్దుర్గ్ మీదుగా సోలాపూర్ చేరుకుంటాయని తెలిపారు. సిద్దిపేటలో ప్రతి రోజు ఉదయం 6 గంటలకు, సాయంత్రం 6:20 గంటలకు సోలాపూర్ వెళ్లే డీలక్స్ బస్సులు అందుబాటులో ఉంటాయని వెల్లడించారు. సోలాపూర్ నుంచి ప్రతి రోజు ఉదయం 7:30 గంటలకు, సాయంత్రం 10 గంటలకు సిద్దిపేటకు బయల్దేరుతాయన్నారు. సిద్దిపేట నుంచి గోండియా టౌన్కు కూడా త్వరలోనే ఆర్టీసీ బస్సులను నడుపుతామని హరీశ్రావు ప్రకటించారు.
మరో పది రోజుల్లో సిద్దిపేట – హైదరాబాద్ మధ్య 10 డీలక్స్ సర్వీసులు అందుబాటులోకి వస్తాయని హరీశ్రావు తెలిపారు. ఈ బస్సులన్నీ సికింద్రాబాద్ మీదుగా తమ రాకపోకలు కొనసాగిస్తాయన్నారు. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని మరిన్ని బస్సులను పెంచుతామని ప్రకటించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ వీ రోజా శర్మ, టీఎస్ఆర్టీసీ రీజినల్ మేనేజర్ సుదర్శన్, డిపో మేనేజర్ సుఖేందర్ రెడ్డితో పాటు పలువురు పాల్గొన్నారు.