సిద్దిపేట అర్బన్, సెప్టెంబర్ 15: సిద్దిపేట వాసుల రైలు కల త్వరలోనే నెరవేరనున్నది. గజ్వేల్ నుంచి సిద్దిపేట వరకు రైల్వే లైన్ పూర్తికాగా, శుక్రవారం రైల్వే సేఫ్టీ అధికారులు ట్రయల్న్న్రు విజయవంతంగా నిర్వహించారు. సికింద్రాబాద్ నుంచి బయలు దేరిన ప్యాసింజర్ రైలు సిద్దిపేట రైల్వేస్టేషన్కు చేరుకున్నది. ట్రయల్ రన్ను అధికారులు దగ్గరుండి పర్యవేక్షించారు. ట్రాక్ వెంట తిరుగుతూ అన్నీ కుణ్ణంగా పరిశీలించారు. త్వరలోనే పూర్తిస్థాయి రైలు సేవలు సిద్దిపేటకు ప్రారంభమవుతాయని అధికారులు తెలిపారు. ఇప్పటివరకు నిర్వహించిన పలు రకాల ట్రయల్ రన్ విజయవంతమైనట్టు వారు పేర్కొన్నారు.
మెదక్ జిల్లా మనోహరాబాద్ నుంచి కరీంనగర్ జిల్లా కొత్తపల్లి వరకు రైల్వే లైన్ ఏర్పాటు కల దశాబ్దాలు పెండింగ్లో ఉన్నది. సమైక్య రాష్ట్రంలో ఈ లైన్ గురించి ఎవరూ పట్టించుకోలేదు. తెలంగాణ వచ్చాక సీఎం కేసీఆర్ శ్రద్ధచూపడంతో ఈ లైన్కు మోక్షం కలిగింది. సగం ఖర్చును రాష్ట్ర ప్రభుత్వం భరిస్తున్నది. ఇప్పటికే మనోహరాబాద్ నుంచి గజ్వేల్ వరకు రైల్వేలైన్ పూర్తికాగా గూడ్స్ తిరుగుతున్నాయి. మెదక్ జిల్లాలో 9.30 కిలోమీటర్లు, సిద్దిపేట జిల్లాలో 83.40 కిలోమీటర్లు, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 37.80 కిలో మీటర్లు, కరీంనగర్ జిల్లాలో 20.86 కిలోమీటర్ల మేర మొత్తం 151.36 కిలోమీటర్ల మేర రైల్వేలైన్ నిర్మిస్తున్నారు. నాలుగు జిల్లాలో మొత్తం 15 రైల్వేస్టేషన్లు రానున్నాయి.