Siddipet | సిద్దిపేట అర్బన్ : సిద్దిపేట వాసుల దశాబ్దాల రైల్వే కల సాకారం కానున్నది. సిద్దిపేట రైల్వేస్టేషన్లో తొందరలోనే రైలు కూత వినబడనున్నది. గజ్వేల్ నుంచి సిద్దిపేట వరకు రైల్వే లైన్ పూర్తవ్వగా.. శుక్రవారం నాడు విజయవంతంగా ట్రయల్ రన్ నిర్వహించారు. బోగీలతో కూడిన ప్యాసింజర్ రైలు సికింద్రాబాద్ నుంచి సిద్దిపేట రైల్వేస్టేషన్కు విజయవంతంగా చేరుకుంది. ఈ ట్రయల్ రన్ను అధికారులు దగ్గరుండి పర్యవేక్షించారు. ట్రాక్ వెంట తిరుగుతూ అన్నీ కుణ్ణంగా పరిశీలించారు. త్వరలోనే పూర్తిస్థాయి రైల్వే సేవలు సిద్దిపేటకు ప్రారంభమవుతాయని అధికారులు తెలిపారు.
మెదక్ జిల్లా మనోహరాబాద్ నుంచి కరీంనగర్ జిల్లా కొత్తపల్లి వరకు కొత్త రైల్వేలైన్ ఏర్పాటు కల దశాబ్దాలు పెండింగ్లో ఉంది. సమైక్య రాష్ట్రంలో ఈ రైల్వే లైన్ గురించి ఎవరూ పట్టించుకోలేదు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఈ రైల్వేలైన్ చేయిస్తున్నారు. సగం ఖర్చును రాష్ట్ర ప్రభుత్వం భరిస్తున్నది. ఇప్పటికే మనోహరాబాద్ నుంచి గజ్వేల్ వరకు రైల్వేలైన్ నిర్మాణం పూర్తయి గూడ్స్ రైళ్లు తిరుగుతున్నాయి. ఈ రైల్వే లైన్ నిర్మాణం మెదక్ జిల్లాలో 9.30 కిలోమీటర్లు, సిద్దిపేట జిల్లాలో 83.40 కిలోమీటర్లు, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 37.80 కిలోమీటర్లు, కరీంనగర్ జిల్లాలో 20.86 కిలోమీటర్ల మేర మొత్తం 151.36 కిలోమీటర్ల రైల్వేలైన్ నిర్మాణం చేస్తున్నారు. నాలుగు జిల్లాలో మొత్తం 15 రైల్వేస్టేషన్లు నిర్మిస్తున్నారు.