సిద్దిపేట అర్బన్, ఫిబ్రవరి 21 : నాడు కాంగ్రెస్ పాలనలో రైతులకు అంతా చింత ఉండేదని, కానీ సీఎం కేసీఆర్ పాలనలో మాత్రం అంతా నిశ్చింతగా ఉన్నారని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. మంగళవారం సిద్దిపేట జిల్లా కేంద్రంలోని కాళ్లకుంట కాలనీలో మిషన్ భగీరథ సిద్దిపేట రింగ్మెయిన్ పైప్లైన్ పనులకు శంకుస్థాపన చేశారు. పత్తి మార్కెట్ యార్డులో భూమిత్ర సిద్దిపేట బ్రాండ్తో జీవ సంపన్న సేంద్రియ ఎరువులను ప్రారంభించారు. ఆ తరువాత ఇంగ్లిష్ అండ్ ఫారెన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ (ఇఫ్లూ) వారు ఇందిరానగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను దత్తత తీసుకునే కార్యక్రమంలో పాల్గొన్నారు. రూ.4.15 కోట్లతో నిర్మించనున్న బీసీ స్టడీ సర్కిల్ భవన నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా హరీశ్రావు మాట్లాడుతూ.. నాడు పంటలు పండక తంటాలు పడేవారని.. నేడు పండిన ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తున్నదని అన్నారు. తెలంగాణ ఏర్పడక ముందు, సీఎం కేసీఆర్ కాకముందు రైతులకు ఎన్నో తిప్పలు ఉండేవని.. కానీ సీఎం కేసీఆర్ సీఎం అయిన తర్వాత వారి బాధలు తీరాయని తెలిపారు. రైతు శ్రేయస్సు కోసమే ప్రభుత్వం పనిచేస్తున్నదని అన్నారు. వానకాలంతో సమానంగా యాసంగిలో కూడా నాట్లు వేశారని, సీఎం కేసీఆర్ దయతో ఇవాళ గ్రామాలన్నీ కనుచూపు మేర ఆకుపచ్చగా కన్పిస్తున్నాయని, ఇందుకు పండిన పంటలే సాక్ష్యమన్నారు.
సీఎం కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టి.. నీళ్లు తెచ్చి, తెలంగాణ ఆత్మగౌరవాన్ని నిలబెడితే.. ప్రతిపక్షాలు నిందలువేసి రాష్ర్టాన్ని నిండాముంచే ప్రయత్నం చేస్తున్నాయని మంత్రి హరీశ్రావు మండిపడ్డారు. నాడు తెలంగాణలో పనిదొరకని దుస్థితి ఉండేదని.. కానీ ఇవాళ పనికోసం పక్క రాష్ర్టాల కూలీలు తెలంగాణకు వచ్చి నాట్లు వేసే పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. సమైక్య రాష్ట్రం లో యాసంగిని బంద్ పెట్టేవారని అన్నారు. పం డిన ధాన్యాన్ని కొనాలని కోరితే నూకలు బుక్కాలని కేంద్రంలోని బీజేపీ నేతలు రైతులను అవహేళన చేసిన విషయాన్ని గుర్తుచేశారు. రైతు పొ లాల్లో కల్లాలు కట్టుకుంటే పైసల్ వాపస్ ఇవ్వాలని కేంద్రం మెలిక పెట్టిందని దుయ్యబట్టారు. అదే ఏపీలో చేపలు ఎండ బెట్టుకునేందుకు కల్లాలు కడితే కేంద్రం అనుమతి ఇచ్చిందని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టి పొలం వాకిట్లో నీళ్లు తెచ్చిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందని తెలిపారు. రాష్ట్రంలో ఇప్పుడు 80 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇవ్వగా నియామక ప్రక్రియ కొనసాగుతున్నదని అన్నారు. దురదృష్టం కొద్దీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఒకేసారి అన్ని నోటిఫికేషన్లు ఎలా ఇస్తారని అడుగుతున్నారని ఎద్దేవా చేశారు. పిల్లల మీద, నిరుద్యోగుల మీద అతడికి ఏ మాత్రం ప్రేమ లేదని.. కేవలం రాజకీయాల మీద మాత్రమే ధ్యాస ఉన్నదని దుయ్యబట్టారు. ఆయా కార్యక్రమాల్లో జడ్పీ చైర్పర్సన్ వేలేటి రోజాశర్మ తదితరులు పాల్గొన్నారు.