తెలంగాణ ప్రజలు నూకలు తినాలని మీ మంత్రి పీయూష్ గోయల్ వెకిరించినప్పుడే బీజేపీకి తెలంగాణలో నూకలు చెల్లిపోయాయి. పెద్ద ఎత్తున రైతులు ఉద్యమిస్తే కార్పొరేట్లకు కొమ్ముకాసే చట్టాలను ఉపసంహరించుకుని తోకముడిచిన మీరా.. రైతు బాంధవుడైన సీఎం కేసీఆర్ను విమర్శించేది? 2జీ 3జీ 4జీ కాదు, కేంద్రంలో దశాబ్ద కాలంగా నాజీలను మించిన నియంతృత్వ పాలన బీజేపీది.
-మంత్రి హరీశ్రావు
Minister Harish Rao | హైదరాబాద్/సిద్దిపేట, ఆగస్టు 27 (నమస్తే తెలంగాణ): కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ 9 ఏండ్లుగా నాజీలను మించిన అరాచక పాలన సాగిస్తున్నదని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి హరీశ్రావు విమర్శించారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల తర్వాత బీజేపీవాళ్లు మాజీలుగా మిగిలిపోవడం ఖాయమని ఎద్దేవా చేశారు. ఖమ్మంలో నిర్వహించిన అమిత్ షా సభలో సీఎం కుర్చీ అంటూ ప్రకటనలు చేసిన బీజేపీ నేతలు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ముందుగా సింగిల్ డిపాజిట్ తెచ్చుకోవాలని ట్విట్టర్ వేదికగా ఆదివారం సవాల్ విసిరారు. ‘మాకు నూకలు చెల్లడం కాదు.. తెలంగాణ ప్రజలు నూకలు తినాలని మీ మంత్రి పీయూష్ గోయల్ వెకిరించినప్పుడే బీజేపీకి తెలంగాణలో నూకలు చెల్లిపోయాయి.
బ్యాట్ సరిగా పట్టడం చేతకాని మీ అబ్బాయికి ఏకంగా బీసీసీఐలో కీలక పదవి ఎలా వరించిందో అందరికీ తెలుసు. అలాంటిది మీరు కుటుంబ పాలన గురించి మాట్లాడటం దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉన్నది. పెద్ద ఎత్తున రైతులు ఉద్యమిస్తే కార్పొరేట్ కొమ్ముకాసే చట్టాలను ఉపసంహరించుకుని తోకముడిచిన మీరా.. రైతు బాంధవుడైన సీఎం కేసీఆర్ను విమర్శించేది? 2జీ 3జీ 4జీ కాదు, కేంద్రంలో దశాబ్ద కాలంగా నాజీలను మించిన నియంతృత్వ పాలన మీది. రాబోయే ఎన్నికల్లో మీరు మాజీలే. సీఎం పదవి కాదు.. ముందు తెలంగాణలో సింగిల్ డిజిట్ తెచ్చుకునేందుకు ప్రయత్నించండి. తెలంగాణ అభివృద్ధి విషయంలో రాజీలేని యోధుడు సీఎం కేసీఆర్. అబద్ధపు విమర్శలు, ఔట్డేటెడ్ ఆరోపణలు, రాసిచ్చిన స్రిప్ట్తో హోం మంత్రి అమిత్షా సిట్ చేశారు’ అని హరీశ్రావు ఆగ్రహం వ్యక్తంచేశారు.
గెలవలేమని తెలిసి అలివికాని హామీలు
ఎన్నికల్లో గెలవలేమని తెలిసే కాంగ్రెస్ పార్టీ ఆచరణ సాధ్యంకాని హామీలిస్తూ ప్రజలను మోసం చేస్తున్నదని మంత్రి హరీశ్రావు విమర్శించారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఆదివారం పలు కార్యక్రమాల్లో మంత్రి పాల్గొన్నారు. కొండా భూదేవి గార్డెన్లో దివ్యాంగులకు రూ.4,016 పెన్షన్ను, బీడీ టేకేదారులకు నూతన పెన్షన్ మంజూరు పత్రాలు, జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు ఉద్యోగ క్రమబద్ధీకరణ ఉత్తర్వులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..‘ఎన్నికలు వస్తున్నాయని కాంగ్రెస్ పార్టీవాళ్లు ఆచరణ సాధ్యంకాని హామీలిచ్చి రాజకీయాలు చేస్తున్నారు. డిక్లరేషన్ల మీద డిక్లరేషన్లు ప్రకటిస్తున్నారు. కాంగ్రెస్వాళ్లను సూటిగా ప్రశ్నిస్తున్నా.. ఈ డిక్లరేషన్ రూపొందించింది ఎవరు? కర్ణాటకు చెందిన ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేనే కదా? ఆయన సొంత రాష్ట్రం కర్టాటక.. ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది కదా? మీరు పాలిస్తున్న రాష్ర్టాలతోపాటుగా కర్ణాటకలో ఈ డిక్లరేషన్లను అమలు చేసి మాట్లాడితే దానికి ఓ నీతి నిజాయితీ ఉంటది కదా? అక్కడ చేయ చేతకాదుకాని తెలంగాణలో చేస్తరట! మనం అంత అమాయకులమా? మనం మోస పోదామా? దయచేసి రాష్ట్ర ప్రజలు ఆలోచన చేయాలి’ అని సూచించారు.
దివ్యాంగులకు తెలంగాణలోనే అధిక పెన్షన్
బీజేపీ 16 రాష్ర్టాల్లో అధికారంలో ఉన్నదని, ప్రధాని ప్రాతినిధ్యం వహిస్తున్న ఉత్తరప్రదేశ్లో, ఆయన సొంత రాష్ట్రం గుజరాత్లో దివ్యాంగులకు పెన్షన్ రూ.వెయ్యి మాత్రమే ఇస్తున్నారని హరీశ్రావు తెలిపారు. ‘కాంగ్రెస్ పార్టీ మూడు రాష్ర్టాల్లో అధికారంలో ఉన్నది. దివ్యాంగులకు పెన్షన్ రాజస్థాన్లో రూ.750, ఛత్తీస్గఢ్లో రూ. వెయ్యి ఇస్తున్నారు. ఈ దేశంలో దివ్యాంగులను గౌరవించిన ఒకే ఒక నాయకుడు మన సీఎం కేసీఆర్. సీఎం కేసీఆర్ దివ్యాంగుల ఆత్మగౌరవాన్ని పెంచారు. దేశంలో ఎక్కడా దివ్యాంగులకు రూ.4,016 పెన్షన్ ఇవ్వటంలేదు. తెలంగాణ రాష్ట్రంలోని 5,05,261 మంది దివ్యాంగులకు నెలకు రూ.4,016 పెన్షన్ ఇస్తున్నారు. దివ్యాంగులు పెన్షన్ పెంచాలని కోరలేదు. ధర్నాలు చేయలేదు. దరఖాస్తు పెట్టలేదు. సీఎం కేసీఆర్ ఓట్ల ముంగిట మాట ఇయ్యలేదు. గత ఎన్నికల ముందు ఇచ్చిన మాట రూ.1,500 పెన్షన్ను మూడు వేలు చేశారు. రూ.2,016 ఇస్తామని హామీ ఇవ్వకున్నా, దివ్యాంగుల మీద ప్రేమతో సీఎం కేసీఆర్ ఇస్తున్నారు. గృహలక్ష్మి పథకంలో కూడా దివ్యాంగులకు 5 శాతం రిజర్వేషన్ కల్పించినం. దివ్యాంగులు సద్దితిన్న రేవును తలుస్తారు. ఒక్కో దివ్యాంగుడు ఒక్కో కేసీఆర్ కావాలి. బీఆర్ఎస్ను మూడోసారి గెలిపించి కేసీఆర్ను హ్యాట్రిక్ ముఖ్యమంత్రిని చేయాలి ’ అని పిలుపునిచ్చారు.
బీడీ కార్మికులకు పెన్షన్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ
బీడీ కార్మికులకు పెన్షన్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని మంత్రి హరీశ్రావు తెలిపారు. ‘16 రాష్ర్టాల్లో బీడీలు చేసే అక్కాచెల్లెళ్లున్నారు. ఎక్కడైనా వాళ్లకు పెన్షన్ ఇస్తున్నరా? బీజేపీ, కాంగ్రెస్ రాష్ర్టాల్లో ఎక్కడా ఇవ్వడంలేదు. తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే మన సీఎం కేసీఆర్ బీడీ కార్మికులకు పెన్షన్ ఇస్తూ ఆర్థిక ధీమా కల్పిస్తున్నారు. మునీములను కూడా కడుపులో పెట్టుకొని కాపాడుకొంటున్నం. మన రాష్ట్రంలో బీడీ కార్మికులు 4,24,205 మంది ఉన్నారు. వీరందరికీ నెలనెలా రూ.2,016 పెన్షన్ ఇస్తున్నాం’ అని వెల్లడించారు. కాంగ్రెస్, బీజేపీవాళ్లు ఆపద మొక్కులు మొక్కుతున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్వాళ్ల్లు ఏదిపడితే అది మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ‘బీజేపీ నేత బండి సంజయ్ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏం చెప్పిండు? సైకిల్ మోటరు పోతే సైకిల్ మోటరు.. కారు పోతే కారు.. బండి పోతే బండి.. గుండు పోతే గుండు ఇస్తానని మొక్కిండు. గెలిచిన తర్వాత ఏమైంది? బండి లేదు, గుండు లేదు.. అంతా ఉత్తదే అయింది. కాంగ్రెసోళ్ల కథ కూడా గట్లనే ఉంటది. వాళ్లు ఏదిపడితే అది చెప్తున్నారు’ అని విమర్శించారు.
తెలంగాణను ఇంకా అర్థం చేసుకోలేదు
తెలంగాణలో సామాజిక, రాజకీయ పరిస్థితులను బీజేపీ ఇంకా అర్థం చేసుకోలేదు. అందుకే అమిత్ షా ఖమ్మంలో ప్రజలకు నచ్చజెప్పాల్సిందిపోయి.. రొడ్డకొట్టుడు ఉపన్యాసం, శుద్ధ అబద్ధాలతో పరువును మరింత దిగజార్చుకున్నారు. 2018 ఎన్నికల్లో బీజేపీ 119 నియోజకవర్గాల్లో పోటీ చేసి 118 చోట్ల ఓడిపోయింది, 100 స్థాన్లాలో డిపాజిట్ కూడా రాలేదు. ఈ సారి 119 నియోజకవర్గాల్లో డిపాజిట్ కోల్పోయేందుకు సిద్ధమైంది.
– దాసోజు శ్రవణ్
తడిపార్ రాజకీయాలు ఇకడ చెల్లవు
బీజేపీది రైతు గోస కాదు.. రాజకీయ గోస. దేశంలో రైతులను ఆదానీ కంపెనీలకు బానిసలుగా చేసేందుకు ప్రయత్నిస్తే, రైతులు ఢిల్లీని గడగడలాడించి ప్రధానితో క్షమాపణలు చెప్పించుకున్న విషయం మరిచిపోయారా? ఖమ్మంలో అన్నదాత బాగు కోసం చేసిన ప్రకటన ఒకటైనా ఉందా?. తెలంగాణలో అన్నదాతకు రైతుబంధు, రైతు బీమా, ఉచిత విద్యుత్ వంటి పథకాలతో రైతును రాజును చేసి దేశానికి తెలంగాణ రాష్ట్రాన్ని అన్నపూర్ణగా తీర్చిదిద్దింది రైతు బిడ్డ కేసీఆర్ పాలనలోని బీఆర్ఎస్ ప్రభుత్వమని ప్రజలకు తెలుసు. తెలంగాణ ప్రజల చైతన్యవంతులు. మీ తడీపార్ రాజకీయాలు ఇకడ చెల్లవు అని అమిత్ షా గుర్తుంచుకోవాలి. మీ రాజకీయాలను తెలంగాణ ప్రజలు తిప్పి కొట్టడం పకా. మీ చిల్లర రాజకీయాలకు తెలంగాణ సమాజం ఏనాడూ తలొగ్గదు.
– కేతిరెడ్డి వాసుదేవరెడ్డి, వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్