హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 4 : జిజ్ఞాస, పట్టుదల ఉంటే ఎన్ని అడ్డంకులు వచ్చినా లక్ష్యాన్ని చేరుకోవచ్చని నిరూపించారు పోస్ట్ డాక్టొరల్ పరిశోధకుడు డాక్టర్ యాకటి వేణు. పరీక్ష ఫీజు కట్టే స్థోమత లేక వైద్య విద్య అభ్యసించలేకపోయిన ఆయన, మరో మార్గం ఎంచుకొని ఏకంగా అమెరికాలోని అలబామా యూనివర్సిటీలో కెమిస్ట్రీలో పీహెచ్డీ చేసే స్థాయికి ఎదిగి అందరికీ ఆదర్శంగా నిలిచారు.
చురుకైన విద్యార్థి
యాకటి వేణు చిన్నప్పటి నుంచీ సూక్ష్మగ్రాహిగా గుర్తింపు పొందారు. 1 నుంచి 4వ తరగతి వరకు సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం తిరుమలాపూర్ గ్రామంలో బాలపోచయ్య మాస్టారు నెలకొల్పిన శాంతినికేతన్ పాఠశాలలో చదివారు. విషయాన్ని వెంటనే గ్రహించే తత్వం వేణు సొంతమని బాలు మాస్టారు తెలిపారు. అనంతరం సొంతూరులోనే 5వ తరగతి పూర్తిచేసి తొగుట రెసిడెన్షియల్ పాఠశాలలో 10వ తరగతి వరకు చదివారు. గజ్వేల్లో 80 శాతం మార్కులతో ఇంటర్, డిగ్రీ పూర్తి చేసుకున్నాడు. తెలంగాణ యూనివర్సిటీ (బిక్కనూరు క్యాంపస్)లో మాస్టర్స్లో ఆర్గానిక్ కెమిస్ట్రీ పూర్తిచేశారు. అనంతరం కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ ఇండస్ట్రియల్ రిసెర్చ్ (సీఎస్ఐఆర్) పరీక్షలో మంచి ర్యాంకు సాధించి సీఎస్ఐఆర్-ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (ఐఐసీటీ- హైదరాబాద్)లో చేరి ప్రొఫెసర్ అరబిందచౌదరి (ఐఐసీటీ చీఫ్ సైంటిస్ట్) పర్యవేక్షణలో ‘లిపోసోమల్ డ్రగ్ క్యారియర్స్ ఫర్ సెలెక్టివ్ టార్గెటింగ్ ఆఫ్ క్యాన్సర్ థెరపాటిక్స్ టు గ్లియోబ్లాస్టోమా (మెదడు కణతి) అండ్ కొలోరెక్టల్ క్యాన్సర్’ అనే అంశంపై తన పరిశోధన చేశారు. ఈ పరిశోధనకుగాను 2020 డిసెంబర్ 23న డాక్టరేట్ పట్టా అందుకున్నారు. పోస్ట్ డాక్టరోల్ రిసెర్చ్ కోసం గత డిసెంబర్ 23 అమెరికాలోని అలబామ యూనివర్సిటీలో అడుగుపెట్టారు.
క్రమశిక్షణతో చదివితే విజయం సొంతం
క్రమశిక్షణతో చదివితే ఎవరినైనా విజయం వరిస్తుంది. జీవితంలో క్రమశిక్షణతోపాటు పట్టుదల, ప్రోత్సాహం ఉండాలి. నా తల్లిదండ్రుల నుంచి ఇవన్నీ నేర్చుకున్నాను. అమెరికాలో విజిటింగ్ సైంటిస్ట్గా అవకాశం వచ్చినా అలబామా వర్సిటీలో పోస్ట్ డాక్టోరల్ వైపు మొగ్గుచూపాను. క్యాన్సర్పై మెరుగైన పరిశోధనలు చేసి ఎక్స్పోజర్ సాధించాలనే ధ్యేయం నాది. పరిశోధన అనంతరం అధ్యాపకుడిగా స్థిరపడుతాను. -డాక్టర్ యాకటి వేణు పోస్ట్ డాక్టోరల్ పరిశోధకుడు