హైదరాబాద్, డిసెంబర్ 19 (నమస్తే తెలంగాణ): కర్ణాటక, తెలంగాణ రాష్ర్టాల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఎన్నికల హామీపై ఎక్స్ వేదికగా కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మధ్య మంగళవారం ట్వీట్ల వార్ జరిగింది. మొదట సిద్ధరామయ్యకు సంబంధించిన ఓ వీడియోను కేటీఆర్ పోస్ట్చేస్తూ హామీల అమలుపై సందేహం వ్యక్తంచేశారు. ఖజానాలో డబ్బు లేదంటూ ఎన్నికల హామీలపై కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం చేతులెత్తేసిందని, తెలంగాణ ప్రజల భవిష్యత్తు కూడా ఇలాగే ఉండబోతున్నదా? అని కేటీఆర్ ట్వీట్ చేశారు.
తెలంగాణలో సైతం కాంగ్రెస్ పార్టీ ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిందని, ఇక తెలంగాణ ప్రజల భవిష్యత్తు కూడా కర్ణాటక మాదిరిగానే అవుతుందేమోనని కేటీఆర్ అనుమానం వ్యక్తంచేశారు. హామీలను గుప్పించేముందు వాటి సాధ్యాసాధ్యాలపై కనీసం ప్రాథమిక అధ్యయనం చేయడం కానీ, ప్రణాళికలు రూపొందించుకోవడం కానీ ఉండదా? అని ప్రశ్నించారు. ‘ఎన్నికల్లో ఓట్లకోసం ఏదో అన్నాం అనుకోండి.
అది ఇస్తాం.. ఇది ఇస్తాం అంటాం. అంతమాత్రాన అన్నీ ఫ్రీగా ఇవ్వా లా? మాకు ఇవ్వాలనే ఉన్నది. కానీ ఖజానాలో డబ్బులు లేవు’ అని సిద్ధరామయ్య అసెంబ్లీలో పేర్కొన్నట్టుగా ఉన్న వీడియోను కేటీఆర్ పోస్టు చేస్తూ.. పార్లమెంటు ఎన్నికల తరువాత తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి కూడా ఇలాంటి ప్రకటనే చేయనున్నారా? అని సందే హం వ్యక్తంచేశారు. తెలంగాణ ఎన్నికల ప్రచారంలో రేవంత్, రాహుల్గాంధీ ఇచ్చిన హామీల వీడియోలు, పేపర్ క్లిప్పింగ్లను పోస్ట్చేశారు.
అది బీజేపీ సృష్టించిన ఫేక్ వీడియో: సిద్ధరామయ్య
కేటీఆర్ ట్వీట్పై కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ఎక్స్ ద్వారా స్పందించారు. ‘తెలంగాణ ఎన్నికల్లో మీ పార్టీ (బీఆర్ఎస్) ఎందుకు ఓడిపోయిందో తెలుసా? ఎందుకంటే కనీసం మీరు ఫేక్ వీడియోలు, ఎడిటెడ్ వీడియోలను కూడా గుర్తించలేకపోతున్నారు. బీజేపీ వాళ్లు ఫేక్ ఎడిటెడ్ వీడియోలను సృష్టిస్తే మీ పార్టీ వాటిని వైరల్ చేస్తుంది. మీ పార్టీ బీజేపీకి పర్ఫెక్ట్ బీ టీమ్. మీరు వాస్తవాలు తెలుసుకోవాలనుకుంటే గతంలో బీజేపీ నాయకులు సృష్టించే ఫేక్, ఎడిటెడ్ వీడియోలపై నేను చేసిన ప్రకటన చదవండి.
బీజేపీ నాపై బురద జల్లే బాధ్యతను మీ పార్టీలోని కొందరు నాయకులకు అప్పగించింది. వారు నా వీడియోలను ఎడిట్చేసి ఫేక్ వీడియోలను సృష్టించి వైరల్ చేస్తారు. ఫేక్ వీడియోలకు బీజేపీ పెట్టింది పేరు. అది భారతీయ జనతా పార్టీ కాదు. ‘బోగ్లే జనతా పార్టీ’. ఇప్పుడు ఆ పార్టీ నేతలు నరేంద్రమోదీ నుంచి సీటీ రవి వరకు పూర్తిగా ఫేక్ వీడియోలపైనే ఆధారపడ్డారు’ అని ట్వీట్ చేశారు.
కాంగ్రెస్ అబద్ధపు హామీలవల్లే మేము ఓడాం: కేటీఆర్ కౌంటర్
సిద్ధరామయ్య ట్వీట్పై మళ్లీ కేటీఆర్ ఎక్స్ ద్వారా స్పందించారు. ‘అబద్ధపు హామీలతో మీ పార్టీ (కాంగ్రెస్) వాళ్లు తెలంగాణ ప్రజలను మోసం చేశారు. కాబట్టే మేము ఎన్నికల్లో ఓడిపోయాం. డిసెంబర్ తొమ్మిదిన ఎన్నికల హామీలు అమలుచేస్తామని, హామీలపై చట్టాలు చేస్తామన్న ప్రకటనలు ఏమయ్యాయి? డిసెంబర్ తొమ్మిది దాటి పది రోజులు గడిచినా మీ పార్టీ ఇచ్చిన హామీలు ఇంతవరకూ నెరవేరలేదు’ అని విమర్శించారు. కాంగ్రెస్ హామీలపై కేటీఆర్ ఈ క్రింది ప్రశ్నలు సంధించారు.