యాదాద్రి, జూలై 31 : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో శ్రావణ మాస సందడి కన్పించింది. ఓవైపు శ్రావణలక్ష్మీ కోటి కుంకుమార్చన, మరోవైపు ఆండాళ్ అమ్మవారికి తిరునక్షత్రోత్సవాలు అత్యంత వైభవంగా సాగుతుండగా భక్తులు దర్శించుకొని మొక్కులు తీర్చుకొంటున్నారు. కొండ కింద దీక్షాపరుల మండపంలో సత్యనారాయణ స్వామి వత్రాలు భారీగా జరిగాయి. కల్యాణకట్టలో స్వామివారికి తలనీలాలు సమర్పించి మొక్కులు తీర్చుకొన్నారు.
యాదాద్రిలో జరుగుతున్న శ్రావణలక్ష్మీ కోటి కుంకుమార్చన కార్యక్రమం 3వ రోజుకు చేరగా, ఆండాళ్ అమ్మవారి జన్మదినాన్ని పురస్కరించుకొని అమ్మవారి తిరునక్షత్రోత్సవాలు 2వ రోజుకు చేరాయి. సుమారు 26 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా, స్వామివారి ఖజానాకు రూ. 28,30,828 ఆదాయం సమకూరినట్టు ఆలయ ఈవో గీత తెలిపారు. కాగా ఆగస్టు 2వ తేదీ నాగపంచమి, 5న వరలక్ష్మీ వ్రతం, 7నుంచి 9వ తేదీ వరకు స్వామివారి పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు. 12న రాఖీ పౌర్ణమి, 20న శ్రీకృష్ణ జన్మాష్టమి, శ్రీకణ్ణన్ తిరునక్షత్రోత్సవాలు చేపట్టనున్నారు.