హైదరాబాద్, ఫిబ్రవరి 14 (నమస్తే తెలంగాణ)/ కరీంనగర్ కమాన్ చౌరస్తా: వార్షిక పరీక్షలకు సన్నద్ధం చేయడంలో భాగంగా కరీంనగర్ జిల్లాలో పదో తరగతి విద్యార్థులకు నిర్వహిస్తున్న ప్రాక్టీస్ టెస్టుల్లో పలువురు ఫెయిలవడం ఆయా బడుల హెచ్ఎంలకు తలనొప్పిగా మారిం ది. ఫలితాల్లో వెనుకబడటం, విద్యార్థులు పరీక్షలకు డుమ్మా కొట్టడం లాంటి కారణాలు చూపుతూ 31 మంది ప్రధానోపాధ్యాయులకు విద్యాశాఖాధికారుల షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ప్రస్తుతం ఈ విషయం ఉపాధ్యాయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ప్రస్తుతం నిర్వహిస్తున్న ఎస్సెస్సీ ప్రాక్టీస్ టెస్ట్-1 లో ఆయా పాఠశాలల్లో 60శాతం లోపు విద్యార్థులే ఉత్తీర్ణత సాధించారు. మరికొన్ని పాఠశాలల్లో పెద్ద సంఖ్యలో విద్యార్థులు పరీక్షకు గైర్హాజరయ్యారు. దీనిని జిల్లా యంత్రాంగం సీరియస్గా తీసుకున్నది.
పాఠశాల స్థాయిలో ప్రణాళిక, పర్యవేక్షణ లోపాలతోనే ఇలా జరిగినట్టు అధికారులు గుర్తించారు. 60శాతం లోపు ఫలితాలొచ్చిన పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు షోకాజ్ నోటీసులిచ్చారు. మీపై క్రమశిక్షణ చర్యలెందుకు తీసుకోకూడదో స్పష్టంచేయాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఫలితాలు తక్కువగా రావడానికి కారణాలు ఏంటో తెలిపాలని కోరారు. ఫలితాలు మెరుగయ్యేందుకు తీసుకునే చర్యలతో పాటు విద్యార్థుల గైర్హాజరుకు కారణాలపై ఆరా తీశారు. కొందరు హెచ్ఎంలు ఎంఈవోలుగా అదనపు బాధ్యతల్లో ఉన్నారని, అనేక పనులు అప్పగించి షోకాజ్ నోటీసులివ్వడం ఎంత వరకు సబబని ఉపాధ్యాయ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. ఈ నోటీసులను ఉపసంహరించుకోవాలని ఉపాధ్యాయ సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు.