గద్వాల: జోగులాంబ గద్వాల (Gadwal ) జిల్లా కలెక్టర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. విద్యాశాఖలో ఒకేసారి 76 మందికి షోకాజ్ నోటీసులు ( Show-Cause Notices ) జారీ చేశారు. జిల్లాలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో ఫేస్ రికగ్నైజ్ సిస్టం హాజరు విధానం సక్రమంగా నిర్వహించకపోవడంతో 76 మంది విద్యాశాఖ సిబ్బందికి షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్( Collector Rizwan Basha) తెలిపారు.
గురువారం జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ పాఠశాలలలో అమలవుతున్న ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ హాజరు నమోదుపై సమగ్రంగా పరిశీలించగా పలుచోట్ల ఉపాధ్యాయులు, ఇతర సిబ్బంది ఎఫ్.ఆర్.ఎస్ యాప్లో హాజరు సక్రమంగా నమోదు చేయకపోవడాన్ని గమనించినట్లు వివరించారు. సంబంధిత సిబ్బంది తమ సంజాయిషీని మూడు రోజుల లోపు సమర్పించాలని ఆదేశించారు.
జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు, సిబ్బంది ప్రభుత్వం నిర్దేశించిన విధి విధానాలను కచ్చితంగా పాటించడంతో పాటు, ప్రతి రోజూ ఎఫ్.ఆర్.ఎస్ ద్వారా హాజరును తప్పనిసరిగా సమయానికి నమోదు చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.