నాగర్కర్నూల్, మార్చి 30: విద్యుత్తు బిల్లుల్లో వ్యత్యాసాలు చూపుతూ.. గ్రామీణ ప్రాంతాలు, తండాల్లో మీటర్లు లేకపోయినా బిల్లులు వసూలు చేసిన సంఘటన నాగర్కర్నూల్ జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. బిల్లుల వసూలులో తేడాలను గుర్తించిన విజిలెన్స్ అధికారులు.. ఈ సంఘటనకు బాధ్యులను చేస్తూ 14 మంది విద్యుత్తు ఏఈఈలు, నలుగురు ఏడీఈలు, ఒక డీఈకి షోకాజ్ నోటీసులు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసినట్టు సమాచారం.
ఎస్పీడీసీఎల్ నుంచి వచ్చిన ఆదేశాల మేరకే ఈ నోటీసులు జారీ అయినట్టు తెలుస్తున్నది. జిల్లాలోని నాలుగు డివిజన్ల పరిధిలో నెలకు రూ.9.32 లక్షల బిల్లుల్లో తేడా వచ్చిన విషయం విజిలెన్స్ అధికారుల విచారణలో వెల్లడైంది. గ్రామీణ ప్రాంతాలు, తండాల్లో నిరుపేదలైన ఎస్సీ, ఎస్టీలకు ఉచితంగా మీటర్లు బిగించాల్సి ఉన్నా బిగించకుండా బిల్లులు వసూలు చేసినట్టు తేలింది. కొందరు వినియోగదారులు మీటర్లను తొలగించిన సంఘటనలు, ఏదో ఒక మీటర్పై రీడింగ్ తీసి బిల్లులు వసూలు చేసిన అంశాలు విచారణలో వెలుగుచూడటంతో నోటీసులు జారీ చేసినట్టు సమాచారం.