Meenakshi Natarajan | (స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, జూన్ 9 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జ్జి మీనాక్షీనటరాజన్కు ఊహించని షాక్ తగిలింది. మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభ స్థానానికి ఆమె దాఖలు చేసిన నామినేషన్ను మంగళవారం రిటర్నింగ్ అధికారులు తిరస్కరించారు. తెలంగాణలో నమోదైన ఒక కేసు వివరాలను అఫిడవిట్లో వెల్లడించకుండా దాచిపెట్టినందున ఆమె నామినేషన్ను తిరస్కరించినట్టు రిటర్నింగ్ అధికారి వెల్లడించారు. మీనాక్షి నామినేషన్ తిరస్కరణకు గురవ్వడంతో కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. ఢిల్లీలోని ఎన్నికల సంఘం కార్యాలయానికి పెద్ద ఎత్తున తరలివచ్చిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. మధ్యప్రదేశ్లో మూడు రాజ్యసభ స్థానాలకు ఈ నెల 18న ఎన్నికలు జరుగనున్నాయి.
మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు కలిగిన అధికార బీజేపీకి చెందిన ఇద్దరు అభ్యర్థులు సులువుగా విజయం సాధించగలరు. మూడో సీటు కోసం కాంగ్రెస్ నుంచి మీనాక్షీనటరాజన్, బీజేపీ నుంచి మహేశ్కేవత్ బరిలోకి దిగారు. సోమవారంతో నామినేషన్ల గడువు ముగియడంతో మంగళవారం నామినేషన్లను రిటర్నింగ్ అధికారులు పరిశీలించారు. తెలంగాణలోని ఒక కోర్టులో మీనాక్షిపై క్రిమినల్ కేసు పెండింగ్లో ఉన్నదని, ఈ వివరాలను అఫిడవిట్లో పేర్కొనకుండా ఉద్దేశపూర్వకంగా దాచిపెట్టారంటూ బీజేపీ అభ్యర్థి మహేశ్ కేవత్ రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేసి అందుకు ఆధారాలు సమర్పించారు. దీంతో ఆమె నామినేషన్ను రిటర్నింగ్ అధికారి తిరస్కరించినట్టు శాసనసభ వర్గాలు తెలిపాయి.
మీనాక్షీనటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరణపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. దీనిపై ఫిర్యాదు చేసేందుకు కాంగ్రెస్ సీనియర్లు కేసీ వేణుగోపాల్, జైరామ్ రమేశ్, సచిన్పైలట్, భూపేశ్భగేల్ తదితరులు ఢిల్లీలోని ఎన్నికల సంఘం కార్యాలయానికి మంగళవారం సాయంత్రం చేరుకొన్నారు. అయితే, అనుమతి లేదన్న కారణంతో వీరిని పోలీసులు అడ్డుకోవడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులకు, కాంగ్రెస్ నాయకులకు మధ్య కొంతసేపు వాగ్వాదం జరిగింది. ఈసీ కార్యాలయం ముందే కాంగ్రెస్ నేతలు బైఠాయించి నిరసన తెలియజేశారు. కాంగ్రెస్ నాయకుల విజ్ఞప్తి మేరకు.. బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు సీఈసీతో భేటీ కావొచ్చని ఈసీ సంబంధిత వర్గాలు కాంగ్రెస్ నేతలకు అపాయింట్మెంట్ ఖరారు చేశాయి.
మధ్యప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీలో 230 స్థానాలు ఉండగా, బీజేపీకి 165, కాంగ్రెస్కు 64 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నది. ఒక స్థానం ఖాళీగా ఉన్నది. ఒక్కో రాజ్యసభ అభ్యర్థి గెలువడానికి సుమారు 58 ఓట్లు అవసరం. ఈ లెక్కన ఇద్దరు బీజేపీ అభ్యర్థులు సులువుగా విజయం సాధించగలరు. ఇద్దరు అభ్యర్థులు పోనూ బీజేపీ వద్ద మరో 49 ఓట్లు మిగులుతాయి. అయితే, కావాల్సిన ఓట్ల కంటే అదనంగా మరిన్ని ఓట్లు ఉండటంతో మూడో ఎంపీ స్థానం కాంగ్రెస్ అభ్యర్థికే దక్కే అవకాశం ఉన్నది. దీంతో కాంగ్రెస్ అభ్యర్థి మీనాక్షీనటరాజన్ గెలుపు ఖాయమని భావించారు. క్రాస్ ఓటింగ్ జరుగకుండా ఉండేందుకు.. తమ ఎమ్మెల్యేలను కాంగ్రెస్.. బెంగళూరుకు తరలించింది. ఈ నేపథ్యంలో మీనాక్షీనటరాజన్ నామినేషన్ను రిటర్నింగ్ అధికారి తిరస్కరించడం సంచలనంగా మారింది. దీంతో బీజేపీ అభ్యర్థి మహేశ్ కేవత్ ఏకగ్రీవమైనట్టేనని సంబంధితవర్గాలు తెలిపాయి.
హైదరాబాద్, జూన్ 9 (నమస్తే తెలంగాణ): మధ్యప్రదేశ్లో రాజ్యసభ ఎన్నికల్లో గెలువలేకనే బీజేపీ కుట్ర చేసి మీనాక్షీనటరాజన్ నామినేషన్ను తిరస్కరించారని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి విమర్శించారు. తెలంగాణలో మీనాక్షీనటరాజన్పై ఎలాంటి క్రిమినల్ కేసులు లేవని చెప్పారు. ఓట్చోరీ, ఎస్ఐఆర్ తర్వాత, ఇప్పుడు బీజేపీ సీట్చోరీకి పాల్పడుతున్నదని ఆరోపించారు. నామినేషన్ను కుట్రపూరితంగా తిరస్కరించడం ప్రజాస్వామ్యానికి చీకటిరోజు అని, దీనిని పౌరులందరూ ఖండించాలని కోరారు. ఈ వ్యవహారంపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని, న్యాయం జరిగే వరకు పోరాడుతామని పేర్కొన్నారు.
బీజేపీ చేష్టలు ఓటు చోరీకి మాత్రమే పరిమితమయ్యాయని మొన్నటివరకూ భావించాం. ఇప్పుడు సీటు చోరీకి కూడా విస్తరించాయి. తగినంత మంది సభ్యుల బలం లేకపోయినప్పటికీ, బీజేపీ మూడో అభ్యర్థిని నిలబెట్టినప్పుడే ఇదంతా మొదలైంది. బీజేపీ తన చర్యలతో ప్రజాస్వామ్యాన్నే కాదు, రాజ్యాంగాన్ని కూడా పూర్తిగా అణచివేస్తున్నది. దీనిపై పోరాటాన్ని సాగిస్తాం. మా వాదనలను పరిగణనలోకి తీసుకోకుండానే నా నామినేషన్ను తిరస్కరించారు. ఇది సరైన చర్య కాదు.
– మీనాక్షీనటరాజన్