Telangana | హైదరాబాద్, డిసెంబర్ 7 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం..తనకు విశ్వాసపాత్రులుగా ఉండే అధికారుల బృందాన్ని ఏర్పాటుచేసుకొనే పనిని ప్రారంభించింది. అందులోభాగంగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి ప్రిన్సిపల్ సెక్రటరీగా సీనియర్ ఐఏఎస్ అధికారి వీ శేషాద్రిని, ఇంటెలిజెన్స్ చీఫ్గా ఏడీజీ శివధర్రెడ్డిని ఎంపికచేసినట్టు తెలిసింది. ఈ మేరకు నేడో, రేపో ఉత్తర్వులు వెలువడనున్నాయి. 1994 బ్యాచ్కు చెందిన శివధర్రెడ్డి.. గతంలో నల్లగొం డ, నెల్లూరు, గుంటూరులో ఎస్పీగా పనిచేశారు.
డిప్యూ టీ కమిషనర్గా, ఏసీబీ డైరెక్టర్గా, డీఐజీ హోదాలో పనిచేశారు. శివధర్రెడ్డి ప్రస్తుతం రెల్వేస్ అండ్ రోడ్ సేఫ్టీ అదనపు డీజీగా పనిచేస్తున్నారు. ‘ఓటుకు నోటు కేసు’ను సమర్థంగా డీల్ చేయడంలో కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు ఇంటలిజెన్స్ చీఫ్గా శివధర్రెడ్డిని నియమించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇంటెలిజెన్స్ విభాగం అధికారుల పని ప్రతిపక్షాలపైనే కాకుండా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, అంతర్గత పార్టీ కార్యకలాపాలపై నిఘా ఉంచాలి కాబట్టి.. ఆ పనికి సమర్థుడైన అధికారిని ఎన్నుకున్నారని సమాచారం.
అందరి దృష్టి.. అధికారుల ‘టీం’ పైనే
కొత్త ప్రభుత్వంలో ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారుల కూర్పు ఎలా ఉండబోతున్నదన్న దానిపై ఆసక్తి నెలకొంది. కీలకమైన ముఖ్యమంత్రి కార్యాలయంలో ఎవరు చేరనున్నారు? జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, పోలీసు కమిషనర్లతోపాటు.. ఆయా శాఖలకు కార్యదర్శులుగా, ముఖ్య కార్యదర్శులుగా, ప్రత్యేక ప్రధాన కార్యదర్శులుగా ఎవరికి అవకాశం దక్కుతుందనే చర్చ, ఆసక్తి అన్ని వర్గాల్లోనూ మొదలయ్యింది.
ఇప్పటికే పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు కీలకమైన పదవుల కోసం తమ ప్రయత్నాలను మొదలు పెట్టినట్టు సమాచారం. కొత్త మంత్రిమండలి కూడా ఏర్పడిన నేపథ్యంలో ఆయా మంత్రివర్గ శాఖలకు ప్రిన్సిపల్ సెక్రటరీలుగా, ప్రత్యేక ప్రధాన కార్యదర్శులుగా పదవులు పొందేందుకు తమకున్న మార్గాల ద్వారా ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. జిల్లాల్లో కలెక్టర్లుగా, ఎస్పీలుగా, పోలీసు కమిషనర్లుగా కొత్త ప్రభుత్వం తమ టీమ్లను నియమించే అవకాశం ఉండటంతో.. పలువురు జూనియర్ అధికారులు, తమ సీనియర్ల ద్వారా, తమకు తెలిసినవారి ద్వారా ప్రయత్నాలు మొదలుపెట్టినట్టు తెలుస్తున్నది.
సీఎస్, డీజీపీల మార్పుపై చర్చ..
రాష్ట్రంలో పరిపాలన, శాంతిభద్రతలను నడిపించే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్), డైరెక్టర్ జనరల్ ఆ ఫ్ పోలీసు (డీజీపీ)ని కూడా మార్చే అవకాశం ఉందని అధికారవర్గాలు, ప్రజాప్రతినిధుల్లోనూ చర్చ కొనసాగుతున్నది. ప్రస్తుతం సీఎస్గా ఉన్న శాంతికుమారి, డీజీపీగా ఉన్న రవిగుప్తాలను మార్చే అవకాశం ఉన్నదని భావిస్తున్నారు. కొత్త ప్రభుత్వం గతంలోని సీఎస్, డీజీపీలను కొనసాగనిస్తారా.. అనేది కొంత అనుమానాస్పదమని అధికాకరవర్గాల్లో చర్చ సాగుతున్నది.