హైదరాబాద్, ఫిబ్రవరి 6 (నమస్తే తెలంగాణ): హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ అక్రమాస్తుల కేసులో మంగళవారం కీలక పరిణామం చోటుచేసుకున్నది. బాలకృష్ణ తమ్ముడు శివ నవీన్కుమార్ను ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. మూడు రోజులపాటు అతడిని విచారించిన అధికారులు.. బాలకృష్ణకు బినామీగా ఉండి నవీన్ భారీగా ఆస్తులు కూడబెట్టినట్టు గుర్తించారు. మరోవైపు శివబాలకృష్ణ కస్టడీ బుధవారంతో ముగియనున్నది. కొన్ని విషయాల్లో ఆయన కీలక సమాచారం దాస్తున్నారనే అనుమానంతో ఏసీబీ మరో ఐదురోజుల కస్టడీ కోరనున్నది.
విచారణ ముగిసిన వెంటనే మరో ఐదు రోజుల కస్టడీపై కోర్టులో పిటిషన్ వేయనున్నది. ఏడు రోజుల విచారణలో శివ బాలకృష్ణ నుంచి పలు కీలక అంశాలు రాబట్టినట్టు తెలిసింది. ఆదిత్య, ఫినిక్స్ రియల్ ఎస్టేట్ కంపెనీలకు చెందిన పలువురు ప్రతినిధులను ఏసీబీ అధికారులు మరోమారు విచారించి కీలక విషయాలు రాబట్టారు. తమ విచారణలో శివబాలకృష్ణ తమ్ముడు శివ నవీన్, మేల్లుడు భరత్ పేరిట భారీగా బినామీ ఆస్తులు ఉన్నట్టు గుర్తించారు. గత ఐదు రోజలుగా హెచ్ఎండీఏ ఆఫీసులోని 4,7 అంతస్థుల్లో ఏసీబీ అధికారులు సోదా లు నిర్వహిస్తున్నారు. సుమారు 26 మందికిపైగా ఏసీబీ సిబ్బంది అన్ని ఫైళ్లకు సంబంధించిన అనుమతులు చెక్ చేస్తున్నారు.