చిగురుమామిడి, మే 1 : కరోనా విళయతాండవం చేస్తున్నవేళ బాధిత కుటుంబాల్లో దుర్భర పరిస్థితులు నెలకొంటున్నాయి. కరోనాతో ఎవరైనా మృతిచెందితే కుటుంబీకులుసైతం దగ్గరకు రావట్లేదు. శనివారం కరోనాతో చనిపోయిన ఓ వృద్ధురాలి అంత్యక్రియలకు ఎవరూ ముందుకురాకపోవడంతో ఆమె మనుమండ్లే మృతదేహాన్ని బైక్పై తరలించిన ఘటన కరీంనగర్ జిల్లాలో చోటుచేసుకొన్నది. చిగురుమామిడి మండలంలోని రేకొండలో శనివారం ఉదయం కరోనాతో ఓ వృద్ధురాలు (95) మృతి చెందింది. వృద్ధురాలి కొడుకు,కోడలికి సైతం పాజిటివ్ రాగా వారు ఇంట్లోనే క్వారంటైన్లో ఉన్నారు. అంత్యక్రియలు చేసేందుకు వారి బంధువులు, చుట్టుపక్కల వారెవరూ ముందుకురాలేదు. దీంతో మనుమడు, మరో వ్యక్తితో కలిసి బైక్పైనే మృతదేహాన్ని వ్యవసాయ బావి వద్దకు తీసుకెళ్లి దహన సంస్కారాలు చేశారు. మృతదేహాన్ని బైక్పై తీసుకెళ్లి అంత్యక్రియలు చేపట్టడం కంటతడి పెట్టించింది.