హనుమకొండ: హనుమకొండలోని (Hanamkonda) శాయంపేట రైల్వే గేటువద్ద ఘోర ప్రమాదం జరిగింది. రైలు ఢీకొని గొర్రెల కాపరి సహా 80 గొర్రెలు మృతిచెందాయి. శాతవాహన రైలు వస్తుండటంతో శాయంపేట రైల్వే గేటు వద్ద గార్డు గేటు వేశారు. అయితే రైలు అప్పుడే వస్తుందా అనుకున్నాడో ఏమో.. కాపరి తన గొర్రెలను కొట్టుకుని ట్రాక్ దాటే ప్రయత్నం చేశారు. కానీ, రైలు అనుకున్న దానికంటే వేగంగా రావడంతో గొర్రెలు పట్టాలపైన ఉండిపోయాయి.
వాటిని తప్పించే క్రమంలో కాపరిని కూడా రైలు ఢీకొట్టింది. దీంతో గొర్రెలతోపాటు అతడు కూడా అక్కడికక్కడే మృతిచెందారు. ప్రమాదం ధాటికి గొర్రెల మృతదేహాలు పట్టాలపై చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన రైల్వే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.