హైదరాబాద్, ఫిబ్రవరి 22: మార్చి మొదటి వారంలో రాష్ట్రంలో రెండో విడత గొర్రెల పంపిణీకి పశుసంవర్ధకశాఖ అధికారులు చర్యలు చేపట్టారు. కొత్త లబ్ధిదారులు వారి వాటా కింద డీడీలు చెల్లించాలని సూచిస్తున్నారు. రాష్ట్రంలో మొదటి, రెండు విడతల్లో ఇప్పటి వరకు 3.88 లక్షల మంది లబ్ధిదారులకు 81.60 లక్షల గొర్రెలను పంపిణీ చేశారు. రెండో విడత కోసం నేషనల్ కో-ఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్(ఎన్సీడీసీ) నుంచి పశుసంవర్ధకశాఖ రుణం తీసుకుంటున్నది. ఈ ప్రక్రియ తుదిదశకు చేరుకున్నది. రుణం మంజూరు కాగానే గొర్రెల పంపిణీ ప్రక్రియను అధికారులు మొదలుపెట్టనున్నారు. రెండో విడతలో సుమారు 3.5 లక్షల మంది లబ్ధిదారులకు గొర్రెలు పంపిణీ చేయాలని నిర్ణయించారు. మార్కెట్లో గొర్రెల ధరలు పెరగటంతో ప్రభుత్వం యూనిట్ ధరను పెంచింది. గతంలో యూనిట్ (21 గొర్రెల) ధర రూ.1.25 లక్షలు ఉండగా, దాన్ని రూ.1.75 లక్షలకు పెంచింది. పెరిగిన ధరకు అనుగుణంగా లబ్ధిదారులు డీడీలు చెల్లించేలా అధికారులు చర్యలు చేపట్టారు.