Sheep Distribution scheme | ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ అనుభవించిన గోస చెప్పుకుంటే పోయేది కాదు. ఎటుచూసినా అంధకారం.. ఉద్యోగాల్లేవు.. కరెంటు లేదు.. మొత్తంగా బతుకే లేకుండా పోయింది. కొట్లాడి సాధించుకున్న తెలంగాణకు కేసీఆర్ సీఎం అయ్యాక తెలంగాణ భాగ్యరేఖలు మారిపోయాయి. ఒక్కొక్క రంగాన్నీ గాడినపెడుతూ వస్తున్న కేసీఆర్ తీసుకువచ్చిన విప్లవాత్మక పథకాలు తెలంగాణను అభివృద్ధి పథంలో నిలిపాయి.
ఆ ఫలితాలు ఇప్పుడు కళ్లముందు సాక్షాత్కరిస్తున్నాయి. ప్రతీ వర్గానికి మేలుచేసేలా సీఎం కేసీఆర్ ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు ఆయా వర్గాల్లో ఆత్మైస్థెర్యాన్ని నింపాయి. గౌరవంతో తలెత్తుకునేలా చేశాయి. అలాంటి వాటిలో ఒకటి గొర్రెల పంపిణీ పథకం. కులవృత్తులు కునారిల్లి చెట్టుకొకరు పుట్టకొకరు అయిన వేళ తీసుకొచ్చిన ఈ పథకం మళ్లీ వారందరినీ కులవృత్తులవైపు మొగ్గేలా చేసింది. కూలికెళ్తూ, పాలేర్లుగా పనిచేస్తూ జీవితాన్ని నెట్టుకొచ్చిన ఎందరో నేడు యజమానులుగా మారి సుఖసంతోషాలతో జీవిస్తున్నారు.
తొవ్వలో గొర్లను చూస్తే కండ్లెంట నీళ్లు పెట్టుకున్న కుటుంబాలు.. ఎప్పటికైనా కులవృత్తి అయిన గొర్రెలను పెంచుకోవాలన్న వారి కలలను ముఖ్యమంత్రి కేసీఆర్ నిజం చేశారు. వారి జీవితాల్లో వెలుగులు నింపారు. ఈ పథకం చలువతో అప్పులు తీసుకొనే స్థాయి నుంచి అప్పులు ఇచ్చే స్థాయికి ఎదిగారు. రాష్ట్రవ్యాప్తంగా ఎంతోమంది గొల్లకుర్మల ఇంట ఇప్పుడు సుఖసంతోషాలు వెల్లివిరుస్తున్నాయి.
ఇయ్యాల పైసలకు లోటు లేదు
మాది వ్యవసాయ కుటుంబం. టెన్త్ పాస్ కాకపోవడంతో చదువు ఆపేసిన. ఏదైనా పనిచేసుకుందామని అనుకుంటుంటే గప్పుడే సర్కారు గొర్రెల పంపిణీ పథకం ప్రారంభించింది. గొర్రెలు, పొట్టేలు కలిపి 21 శాల్తీలను ఇచ్చిర్రు.
మా అక్క లక్ష్మి కుటుంబానికి కూడా గొర్లు వచ్చినయ్. భర్త చనిపోయాక మాతోనే కలిసి ఉంటున్నది. ఇద్దరివి కలిపి 250 గొర్లు అయినయ్. కొన్నింటిని అమ్మగా 4లక్షల వరకు ఆదాయం వచ్చింది. నాకున్న రెండెకరాల్లో ఎవుసం చేసుకుంటూనే గొర్రెలను కాసుకుంటున్న. జీతగాళ్లలా బతికిన మేం సర్కారు దయ వల్ల ఇయ్యాల మంచిగ బతుకుతున్నం. బ్యారగాళ్లమై అమ్ముతున్నం. కొంటున్నం.
– బొడంపాటి రాజు, తిమ్మారెడ్డి గూడెం, షాబాద్ మండలం, రంగారెడ్డి జిల్లా
కేసీఆర్ నన్ను యజమానిని చేసిండు
మాది చెన్నూర్లోని లైన్గడ్డ వాడ. నాకు పది గొర్రెలున్నయ్. వాటితో కుటుంబం గడవడం కష్టమైతదని మా అత్త వాళ్ల మందలో కలిపిన. రెండు నెలల కిందటి దాకా చెన్నూర్లో బర్రెలు కాసిన. సర్కారోళ్లు గొర్లు ఇస్తున్నరంటే రూ.43,750తో డీడీ తీసిన. 20 గొర్రెలు, పొట్ట్టేలు ఇచ్చిన్రు.
మా ఇంటోళ్లందరం మస్తు సంబురపడ్డం. మా అత్త వాళ్ల దగ్గర ఉన్న గొర్రెలను కూడా తీసుకొచ్చి వీటిలో కలుపుకొన్న. ఇప్పుడు నాకు 30 గొర్రెలు, ఒక పొట్టేలుంది. ఇప్పుడు నా గొర్రెలను నేనే కాసుకుంటున్న. మందలో 15 గొర్రెలు సూడివి ఉన్నయి. రెండు నెలలకు ఈతకు వస్తవి. అప్పుడు మొత్తం 45 దాకా అయితయనుకుంటున్న. బర్రెలు కాసుకుంటూ బతికే నన్ను కేసీఆర్ సారు గొర్రెలకు యజమానిని చేసిండు. ఆయన దయతో మళ్లా కులవృత్తి చేసుకుంటున్న. మా బతుకులకు భరోసానిచ్చిన సీఎం కేసీఆర్కు జీవితాంతం రుణపడి ఉంట.
– గండ్రకోట లింగయ్య, లైన్గడ్డ, చెన్నూర్ (ఆదిలాబాద్)
రూ. 3.50 లక్షల అప్పు తీర్చిన కుటుంబం
వీరు చిటుకూరు ఎల్లయ్య-కనుకవ్వ దంపతులు. కరీంనగర్ మండలం చెర్లభూత్కూర్. 29 జూన్ 2017న సబ్సిడీ కింద రాష్ట్ర ప్రభుత్వం 20 గొర్రెలు, పొట్టేలు ఇచ్చింది. ఏడాదిలో 45 గొర్రెలు అయ్యాయి. రెండో ఏడాది మరో 40 గొర్రెలకు పెరిగాయి.
ఇలా గడిచిన ఐదారేండ్లలో 200 గొర్రెలతో ఆయన మంద పెరిగింది. ఇప్పుడు వాటిని మేపేందుకు భర్తకు తోడుగా భార్య కనుకవ్వ కూడా వెళ్తున్నది. ఇప్పటికే 70కిపైగా గొర్రెలు అమ్మిన ఎల్లయ్య ఏడాదికి లక్ష రూపాయల ఆదాయం వస్తున్నట్టు చెప్తున్నాడు. వీటి ద్వారా రూ.3.50 లక్షల అప్పు తీర్చుకున్నాడు. ఇంటిని బాగుచేసుకున్నాడు. ఇప్పుడు రెండో విడతలో కొడుకు హరీశ్ పేరిట మరో 21 గొర్రెలు వచ్చాయి. వీటిని మేపుతూ భార్యాభర్తలు హాయిగా బతుకుతున్నారు. ఎప్పుడు ఏ ఆపద వచ్చినా, ఏ అవసరం వచ్చినా అమ్ముకునేందుకు వీలుగా తమ వద్ద గొర్రెలు ఉన్నాయని సంతోషంగా చెబుతున్నారీ దంపతులు.
ఒక్క యూనిట్ ఎకరం భూమితోని సమానం
నాది ములుగులోని గొల్లవాడ. 13 ఏండ్ల సంది గొర్లు కాస్తున్న. 2018లో మొదటి విడతల నాకు గొర్రెలు మంజూరైనయ్. 30 వేల రూపాయల డీడీ కట్టిన. 21 గొర్రెలు ఇప్పించిన్రు. వాటిని కాసుకొని పెంపు చేసుకున్న.
ఐదేండ్లలో 21 గొర్రెలు 60 మందగా తయారైంది. మధ్య మధ్యన కొన్ని గొర్లు రోగాలు వచ్చి చనిపోయినయ్. కొన్ని అమ్ముకున్న. అయినా కూడా పాత గొర్లను కలుపుకొని మొత్తం నా కాడ 110 గొర్రెలున్నయి. గొర్లను సాదడమంటే ఎకరం భూమిలో వ్యవసాయం చేసినట్లే. నాకు రెండెకరాల భూమి ఉన్నది. అందులో వడ్లు పండుతయి. పెట్టుబడి సాయం కింద రైతు బంధు పైసలు కూడా వస్తన్నయ్. మొన్న లక్ష రూపాల రుణమాఫీ కూడా అయింది. గొల్ల, కురుమలకు సీఎం కేసీఆర్ సారు మంచి చేస్తండు.
– బైకాని సారయ్య , గొర్రెల పంపిణీ లబ్ధిదారుడు, ములుగు
50 ఏండ్ల పాలేరుతనం తొలగిపోయింది
నేను పుట్టి బుద్ధెరిగినప్పటి నుంచి వ్యవసాయ పనుల కోసం రైతుల వద్ద పాలేరుగా పని చేసిన. ఇక నా జీవితం మొత్తం పాలేరుగానే ముగిసిపోతుందనుకున్న.
తెలంగాణ వచ్చినంక సీఎం కేసీఆర్ సార్ గొర్రెల పంపిణీ పెట్టిండు. నాకు, నా కొడుక్కు గొర్రెలు వచ్చినయ్. ఇగ 50 ఏండ్ల పాలేరు పని తప్పింది. నిత్యం ఆసాముల తిట్ల మధ్య పనులు చేసిన నేను ఇప్పుడు ఓ జీవాల మందకు యజమానినైన. ఏండ్ల తరబడి రాత్రనక, పగలనక రైతుల వ్యవసాయ బావుల వద్దనే నా జీవితం గడిచిపోయింది. తెలంగాణ వచ్చినంక రాత్రి పూట బాయిలకాడికి పోవుడు బందు అయింది కానీ అంతకుమునుపు కరెంటు మోటర్లు ఒత్తేందుకు పురుగుబూసి భయం ఉన్నా బాయికాన్నే పండుకునేది. నాకు ముఖ్యమంత్రి సార్ ఇచ్చిన ఈ జీవాలు కొత్త జీవితాన్ని ఇచ్చినయి. ఇప్పుడు నేను ఎవ్వలతోని తిట్లు పడుతలేను. ఎగిలివారంగానే లేచి బాయి బాట పట్టే పనిలేదు. గొర్లను ఇడిసిపెట్టేదాంక ఇంటి పట్టునే ఉండి పిలగాండ్ల మంచి చెడ్డలు అరుసుకుంటాన.
– కడారి ఐలయ్య, గొర్రెల పంపిణీ లబ్ధిదారుడు, ఎల్కతుర్తి, హనుమకొండ జిల్లా
గుంటభూమి లేని మేం గొర్రెలతో దర్జాగా బతుకుతున్నం
మాది నిరుపేద కుటుంబం. చానా ఏండ్లుగా పూరిగుడిసెలో ఉంటూ కూలి పనులకు వెళ్లేదాన్ని. ఇప్పుడు కేసీఆర్ సారు ఇచ్చిన గొర్రెలతోనే మా కుటుంబం బతుకుతున్నది. ఆరేండ్ల కింద నాకు 21 గొర్రెలు ఇచ్చిండ్రు.
ఇప్పుడు మాకు 54 గొర్రెలు ఉన్నయ్. ఆరేండ్ల నుంచి ఏటా లక్షన్నరకు పైగా ఆదాయం వస్తుంది. నా భర్త సైదులుకు రెండేండ్ల క్రితం ఆరోగ్యం బాగలేకపోతే గొర్రెలు అమ్మగా వచ్చిన రెండు లక్షలతో వైద్యం చేయించిన. అయినా జబ్బు ముదిరి చనిపోయిండు. గొర్రెలపై వచ్చిన సంపాదనతోనే ఏడాది కింద రెండు రూముల ఇల్లు కట్టుకున్నా. ఈ మధ్యనే గొర్రెలు తడవకుండా చిన్న రేకుల షెడ్డు కట్టించుకున్నా. గుంట భూమి లేని మేము కూలికి పోకుండా గొర్రెలను మేపుకొంటూ దర్జాగా బతుకుతున్నాం.
– గంట లక్ష్మమ్మ, కుక్కడం గ్రామం, మాడ్గులపల్లి మండలం, నల్లగొండ జిల్లా
మమ్మల్ని అందరూ సేట్లు అంటున్నరు
మా అయ్యవ్వలు మేకలు కాసి మాకప్పగించిండ్రు. చెట్లెంట, చెరువుల పొంట మేకలను తిప్పి మేపుతుండేటోళ్లం. మాకు సొంతంగా లేక ఇంకోళ్ల దగ్గర కాపర్లుగా జీతం జేసినం. వాళ్లిచ్చే జీతంతో పొట్టే గడువలేదు. ఇంక మేకలు కొని ఏం బ్యారం సేత్తమంటూ మా ఆయన చంద్రయ్య ఊకే రందిపడ్డడు.
ఇద్దరు పోరగాండ్లను మంచిగ సదివించి పెద్దోళ్లను జెయ్యాలని సర్కారు బడిలో ఏసిన. కాలం కలిసొచ్చిందేమో. దేవునోలే కేసీఆర్ సార్ గొల్లకుర్మలందరికీ గొర్రెలు ఇత్తుండ్రని మా సర్పంచ్ చెప్తే, కాగితం మీద రాసి సార్లకు ఇచ్చినం. లిస్టులో మీ పేరొచ్చిందని ఊరోళ్లు చెపితే నమ్మలేదు. పంచాయతీ గోడకు అంటించిన కాగితంలో ఉందో లేదో సూసిరమ్మని మా పిల్లలకు చెప్పి తోలించిన. అవ్వా మన పేరొచ్చిందని వాళ్లు సెప్పిన్రు. నాకు నిజంగా నోట మాట రాలె. మా ఆయనకు సెప్పి సంబురపడ్డ. 21 గొర్రెలు వచ్చినయి. పుట్టిన గొర్లను సాదుకుంటూ, పొట్టేళ్లను అమ్ముకుంటూ బతుకుతున్నం. మమ్ముల్ని అందరూ సేట్లు అంటుంటే ముచ్చటనిపిస్తంది.
– ఎక్కల్దేవి పద్మ, గొర్రెల కాపరి, కొండాపూర్, రాజన్న సిరిసిల్ల జిల్లా
మంద పెరిగింది..గతంలో నా దగ్గర ఒకటి
రెండు గొర్రెలు, మేకలు ఉండేటివి. అప్పుడు వాటిని కాయడానికి గుట్టపైకి ఎళ్లేటోడిని. వీటి కోసం ఇంత దూరం పోయి మేపాల్సి వస్తుందని బాధపడేటోడిని. సర్కారు ఇచ్చిన గొర్రెలతో ఇప్పు డు మంద పెరిగింది.
గొర్రెల మందను చూసినప్పుడల్లా మనసు తృప్తి అవుతాంది. ఇప్పడున్న మందను రెండింతలు చేయాలని మంచిగా మేపుతున్న. గొర్రెల పెంపకంతో నాకు బతుకు దెరువు దొరికింది. పొద్దంతా గొర్రెలను కాస్తున్న. ఇప్పుడు మంచిగున్నది. తెలంగాణ సర్కారు ఏర్పడ్డ తర్వాతనే మాకు సర్కారు సంది గొర్లు అచ్చినయి. గతంల మా బతుకులను ఎవలూ పట్టించుకోలేదు. ఇప్పుడైతే గీ సర్కారు అందరికీ మంచి జేస్తున్నది. బెస్తోళ్లకు చేపల ఇయ్యవట్టే. మాకు గొర్లు ఇయ్యవట్టే. ఎస్సీలకు అవీవి ఇవ్వవట్టే. పింఛన్లు రావట్టే అందరికీ. ఇంకే కావాలి. అందరికీ మంచిజేయవట్టే.
-బండారి నర్సింలు, లబ్ధిదారుడు, శాలిపేట, చిన్నశంరంపేట, మెదక్ జిల్లా
గొర్రెలుంటే పైసలున్నట్టే
ప్రభుత్వం మొదటి విడతలో నాతో పాటు మా బంధువులకు మూడు యూనిట్లను పంపిణీ చేసింది. అందరం కలిసి ఒకేచోట జీవాలను పెంచుతున్నం. ఇప్పడు మందలో 100 గొర్రెలు ఉన్నయ్. ఇంట్లో గొర్రెలు ఉంటే పైసలు ఉన్నట్టే.
మనకు కష్టం వచ్చినా, డబ్బులు అవసరమైనా గొర్రెలు అమ్మితే డబ్బులు వస్తయ్. గతంలో డబ్బులు అవసరమైతే అప్పులు చేయాల్సిన పరిస్థితి ఉండేది. ఎక్కువ మిత్తికి డబ్బులు తీసుకుని కూలి పనులు చేసుకుంటూ చెల్లించేటోళ్లం. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. మేం ఇప్పటి వరకు రూ.2 లక్షల విలువైన గొర్రెలు అమ్మాం. ప్రభుత్వం కులవృత్తులను ప్రోత్సహించడానికి చేపట్టిన గొర్రెల పంపిణీ వల్ల మాలాంటోళ్ల ఉపాధి ఎంతో మెరుగుపడింది.
– కేమ కిష్టయ్య, లబ్ధిదారుడు, వడ్డాడి (ఆదిలాబాద్)
జేబుల లక్ష రూపాయలు ఉన్నట్టున్నది
నాకు ఇద్దరు కొడుకులు ఒక బిడ్డ. ఒక్క కొడుకుది, బిడ్డది పెళ్లి చేసిన. 30 ఏండ్లు హమాలీ పనిచేసి పిల్లలను చదివించి, పెండ్లి జేసిన. హమాలీ పని చేతకాక మూడేండ్ల కింద మానేసిన. ఇటీవల రెండెకరాల పొలం కొనుక్కుని వ్యవసాయం చేసుకుంటున్న.
మూడు నెలల కింద ప్రభుత్వం 18 గొర్లు ఇచ్చింది. ఒక దిక్కు ఎవుసం చేసుకుంట, ఇంకోదిక్కు గొర్లు కాసుకుంటున్న. ఈ గొర్రెలు రాకముందు పైసలు అవసరం బడితె భూమి కాగితాలు పెట్టి తెచ్చుకునేది. ఇప్పుడు నా ఇంటి ముందున్న గొర్లను చూసి ఎవరైనా అప్పు ఇస్తరు. నా కాడ ఉన్న గొర్రెలకు లచ్చ కంటె ఎక్కువనే వస్తయి. ఇంటి ముందు గొర్రెల మందను చూస్తే నా జేబులో పైసలు ఉన్నట్లే అనిపిత్తాంది. అత్యవసర సమయంలో పైసలు అవసరం పడితే ఎవరి వద్దకు అప్పుకోసం పోవాల్సిన పని లేకుంట ధైర్యమచ్చింది. కేసీఆర్ సారు దయవల్ల మాకు గౌరవం వచ్చింది.
– కుక్కల రాజయ్య, నష్కల్, చిల్పూరు మండలం, జనగామ జిల్లా
పొట్టేళ్లు అమ్ముకుంటే రూ. 50 వేలు వస్తాంది
గొల్ల కురుమలను ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం కూడా పట్టించుకోలే. ఆరేండ్ల క్రితం ప్రభుత్వం మాకు 20 గొర్లు, ఒక పొట్టేలు ఇచ్చింది. మా కుటుంబానికి రెండు యూనిట్లు వచ్చాయి.
గతంలో మాకు 50 గొర్లు ఉండే. వాటితో పాటు ప్రభుత్వం ఇచ్చిన గొర్లతో ఏడాదికి 15 నుంచి 20 గొర్రె పిల్లలు వస్తున్నాయి. ఆరేండ్లలో 200 గొర్ల వరకు వచ్చాయి. దీనికి తోడు పొట్టేళ్లు అమ్మకుంటే ఏడాదిలో 50వేల వరకు వస్తాంది. నా ఇద్దరు కొడుకులకు తల ఐదెకరాలు పంచి ఇచ్చిన. రైతుబంధు వస్తుంది. నా చిన్న కొడుకు పొలం వద్ద చనిపోతే రైతుబీమా కింద 5 లక్షలు వచ్చినయ్. ప్రభుత్వం ఇచ్చిన గొర్లతో గొల్లకుర్మలు మంచిగా బతుకుతున్నరు.
– జక్కుల సోమయ్య (పెద్ద గొల్ల) పడమటిగూడెం, నర్సింహులపేట, మహబూబాబాద్
నాడు హమాలీ…నేడు ఏటా లక్షన్నర ఆదాయం
గతంలో హమాలీ పని చేసుకుంటూ ఎన్నో కష్టాలు పడ్డా. చాలీచాలని డబ్బులతో అప్పులపాలయ్యా.
అలాంటి సమయంలో కేసీఆర్ సర్కార్ తీసుకొచ్చిన గొర్రెల పంపిణీ పథకంతో మా పరిస్థితి పూర్తిగా మారిపోయింది. తెలంగాణ ప్రభుత్వం సబ్సిడీ కింద 21 గొర్రెలు ఇచ్చింది. హమాలీ పని బంద్జేసి గొర్రెలు కాసుకున్న. సీఎం కేసీఆర్ సారు ఇచ్చిన 21 గొర్రెలు ఇప్పుడు 60 జీవాలు అయ్యాయి. గొర్రె పిల్లల విక్రయంతో ప్రతి సంవత్సరం రూ.లక్షన్నర వరకు ఆదాయం వస్తున్నది. గత ఐదేండ్లలో 100 గొర్రెల వరకు విక్రయించి రూ.7 లక్షల వరకు సంపాదించిన. సబ్సిడీ గొర్రెలతో వచ్చిన ఆదాయంతో రూపాయి అప్పు చేయకుండానే కూతురు పెళ్లి చేసిన. గొర్రెలు ఇచ్చి మాలాంటి కుటుంబాలను ఆదుకొంటున్న కేసీఆర్ సార్కు జీవితాంతం రుణపడి ఉంటాం.
– గొల్ల వెంకటయ్య, పులుమద్ది, వికారాబాద్ జిల్లా
గొర్రెలతో బతుకుదెరువు దొరికింది
గీ తెలంగాణ సర్కారు మాకు ఫాయిదా చేస్తున్నది. గొర్రెలిచ్చి బతుకుదెరువు సూపుతాంది. నాకు సర్కారు సంది 20 గొర్రెలు, 1 పొట్టేలు ఇచ్చిండ్రు. గొర్రెలను అడవికి తీసకపోయి మేపుతున్న. నాకు బతుకుదెరువు దొరికింది. గొర్రెల పెంచుతుండడంతాని
నా కుటుంబ బతకుతాంది.
గొర్రెలు ఒక ఈతకు అస్తే మస్తు పైసలు అస్తయి. ఈతకు అచ్చె వరకు మేపితే డబల్ పైసలు అస్తయి. మాగొల్లకుర్మలను గప్పట్ల ఎవలూ పట్టించుకోలే. గిప్పుడే మాకు గొర్రెలస్తన్నయి. సర్కారు నుంచి ఫాయిదా జరుగుతున్నది. గీ తెలంగాణ సర్కార్లనే మంచిగున్నది. గతంల జీవాలను మేపాలంటే చానా కష్టం అయ్యేది. మేత దొరక పోయేది. నీళ్లకు గోస ఉండేది. గిప్పుడైతే గలాంటి తిప్పలు లేవు.
-రాములు, లబ్ధిదారుడు, జీహెచ్ కోనాపూర్ (సంగారెడ్డి జిల్లా)
మూడేండ్లలో రూ. 8 లక్షలు సంపాయించినం
మాకు గతంలో 20 గొర్ల వరకు ఉండేవి. నా ఇద్దరు కొడుకులకు వచ్చిన 40 గొర్లతో పెద్ద మందే అయింది. సీఎం కేసీఆర్ వచ్చేదాకా మా కులపోళ్ల గురించి ఎవ్వలు పట్టించుకోలె. మాకు సాయం చేయడానికి ఎవలూ ముందుకు రాలె. ఏ గవర్నమెంటు మాకు సాయం సెయ్యలేదు.
ఐదేండ్ల క్రితం గొర్రెకు ఐదువేల ధర పలికితే ఇప్పుడు రూ.12 వేలు దాకా పడుతున్నది. మేం అరవైదాక మందను కాత్తన్నం. ఇండ్ల పెరిగినయి కొన్ని అమ్ముడు కూడా సేసినం. ఈ పసలకు నలభై దాక గొర్లు అమ్మితే మూడు లచ్చల రూపాయల దాక అచ్చినయి. మూడేండ్ల సంది గొర్లమీద ఎనిమిది లచ్చలు దాక సంపాయించినం. వ్యవసాయంకు పెట్టుబడికంటే ఈ గొర్లే నయం అనుకుంటున్నం. పదమూడువేల దాక గొర్రె అమ్ముతున్నం. సుట్ట్టుపక్కల కెల్లి కూడ సాలమంది బ్యారగాల్లు మన గొర్లు కొనడానికి వస్తండ్రు. మంచి ధర పెడుతుండ్రు.
-కాశబోయిన రాజయ్య కుటుంబం, ఆరపల్లి (సిద్దిపేట)