Telangana | హైదరాబాద్, డిసెంబర్ 1 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న గొర్రె ల పంపిణీ పథకం అద్భుతాలు సృష్టిస్తున్నది. ఒకప్పుడు రోజుకు ఆరేడు వందల లారీల గొర్రెలను దిగుమతి చేసుకున్న తెలంగాణ.. ఇప్పుడు మాంసం లభ్యతలో దేశంలోనే నంబర్వన్ స్థానానికి ఎదిగింది. కేసీఆర్ 2017లో ప్రారంభించిన ఈ పథకం గొల్ల, కురుమల కులవృత్తికి పూర్వవైభవంతో పాటు వారిని ఆర్థికంగా నిలబెడుతున్నది. రాష్ట్రానికీ ఆర్థిక దన్నుగా నిలుస్తున్నది. కేంద్ర పశుసంవర్ధక, మత్స్య, పాడిపరిశ్రమాభివృద్ధి శాఖల ఆధ్వర్యంలో ప్రాథమిక పశుపోషణ గణాంకాల (బేసిక్ యానిమల్ హస్బెండరీ స్టాటిస్టిక్స్) వెల్లడించిన వార్షిక నివేదిక-2023 ప్రకారం దేశంలో మాంసం లభ్యతలో తెలంగాణ నంబర్వన్ స్థానంలో నిలిచింది.
తెలంగాణలో నాలుగేండ్లుగా అమలుచేస్తున్న గొర్రెల పంపిణీ పథకంతో మాంసం ఉత్పత్తి, లభ్యత పెరిగాయి. ఈ పథకం కింద ఇప్పటి వరకు 1.28 కోట్ల గొర్రెల పంపిణీ జరిగింది. పౌల్ట్రీరంగం కూడా 1,500 కోళ్లఫారాలతో పురోగమిస్తున్నది. మాంసం లభ్యతలో తెలంగాణ అగ్రస్థానంలో, మాంసం ఉత్పత్తిలో ఐదో స్థానంలో ఉన్నదని నివేదిక తెలిపింది. కోడిగుడ్ల తలసరి లభ్యతలో 2వ, ఉత్పత్తిలో 3వ స్థానంలో ఉన్నట్టు వెల్లడించింది. పాల ఉత్పత్తి, లభ్యతలో 13వ స్థానంలో ఉన్నట్టు వివరించింది.