హైదరాబాద్, ఆగస్టు 31 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంపై మళ్లీ కుట్రలు మొదలయ్యాయి. తెలంగాణలో వైఎస్ పాలన తెస్తామంటూ కాంగ్రెస్ నేత ఒకరు ఏపీ వెళ్లి ఉపన్యాసాలు ఇచ్చారు. మరోవైపు, తెలంగాణను వ్యతిరేకించిన వైఎస్ కుమార్తె షర్మిల.. తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసేందుకు సిద్ధమవుతున్నారు. తాజా పరిణామాలన్నీ నిశితంగా గమనిస్తే తెలంగాణపై మళ్లీ కుట్రకు తెరలేపుతున్నారన్న అనుమానం కలగకమానదు. పీపుల్స్ మార్చ్ పూర్తికావడంతో తిరుమల వెంకన్నను దర్శించుకున్న సీఎల్పీ నేత, మధిర ఎమ్మెల్యే భట్టి విక్రమార్క గురువారం ఇడుపులపాయలో వైఎస్ రాజశేఖర్రెడ్డి సమాధిని సందర్శించి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో మళ్లీ వైఎస్సార్ పాలనను తెస్తామని, ఆయన ఆలోచనలు, ఆశయాలను అమలు చేస్తామని పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పాటును అడుగడుగునా అడ్డుకున్న వైఎస్సార్ ఆలోచనను ముందుకు తీసుకెళ్తామని ఆయన ప్రకటించడంపై తెలంగాణవాదులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు, తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించి, ఇటీవల వైఎస్సార్టీపీ పేరుతో పార్టీ ప్రారంభించి ప్రభుత్వంపై నిత్యం విషం కక్కుతున్న వైఎస్సార్ కుమార్తె వైఎస్ షర్మిల తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేయబోతున్నారు. ఈ మేరకు గురువారం ఢిల్లీ వెళ్లి సోనియాను కలిశారు.
తెలంగాణ ఏర్పాటునే జీర్ణించుకోలేని షర్మిలను పార్టీలో చేర్చుకోనుండడం, రాష్ట్ర ఏర్పాటును అడ్డుకున్న వైఎస్సార్ సమాధి వద్దకు వెళ్లి ఆయన ఆశయాలను సాధిస్తామని భట్టి చెప్పడం చూస్తుంటే తెలంగాణపై కాంగ్రెస్ పార్టీ మరోమారు కుట్రకు తెరలేపుతున్నదా అన్న అనుమానాన్ని తెలంగాణవాదులు వ్యక్తం చేస్తున్నారు. సమయం దొరికిన ప్రతిసారీ రాష్ట్ర ఏర్పాటు అంశాన్ని పక్కదోవ పట్టించే ప్రయత్నం చేసిన భట్టి.. వైఎస్ సమాధిని సందర్శించి నివాళులు అర్పించడాన్ని తెలంగాణవాదులు జీర్ణించుకోలేకపోతున్నారు. మరోవైపు, షర్మిల చేరికను కాంగ్రెస్ నేతలే విమర్శిస్తున్నారు. ఆమె తెలంగాణ రాజకీయాల్లో జోక్యం చేసుకుంటే పార్టీకి నష్టమని, కాబట్టి ఏపీకే పరిమితం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ కారణంగానే షర్మిలతో పీసీసీ నేతలెవరూ ఢిల్లీ వెళ్లలేదని, ఇక్కడ కూడా ఆమెనెవరూ కలవలేదని సమాచారం.