ఖమ్మం, డిసెంబర్ 17: ‘షర్మిలా.. నోరు అదుపులో ఉంచుకో.. నీ తండ్రి కంటే పెద్ద వయసున్న సీఎం కేసీఆర్ను విమర్శిస్తే సహించం.. అనవసరంగా నోరు జారితే తగ్గిన బుద్ధిచెప్తాం’ అని బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధు వైఎస్ షర్మిలను హెచ్చరించారు. ‘నువ్వు ముమ్మాటికీ బీజేపీ వదిలిన బాణమే’నని స్పష్టం చేశారు. తెలంగాణను సాధించి, ప్రపంచపటంలో రాష్ర్టానికి గుర్తింపు తెచ్చిన నేత సీఎం కేసీఆర్ అని కొనియాడారు. ఆయనను ఇష్టానుసారంగా విమర్శిస్తే నర్సంపేట కంటే రెట్టింపు స్థాయిలో బీఆర్ఎస్ కార్యకర్తలు బుద్ధిచెప్తారని హెచ్చరించారు. శనివారం ఖమ్మంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
తెలంగాణ అభివృద్ధిని, ప్రజల్లో బీఆర్ఎస్కు ఉన్న ఆదరణ ను చూసి ఓర్వలేక బీజేపీ పన్నుతున్న కుట్రలో షర్మిల ఓ భాగమని ఆరోపించారు. ‘నీ తండ్రి వైఎస్సార్ సీఎంగా ఉన్న సమయంలో ఖమ్మం జిల్లా గనులను కడపకు దోచుకెళ్లలేదా? ఏజెంట్ కొండల్రావు ద్వారా బయ్యారం నుంచి కొత్తగూడెం వరకు ఉన్న ఐరన్ ఓర్ను దోచుకున్నది నిజం కాదా? అంటూ షర్మిలను ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ ప్రజాస్వామ్యానికి పెద్దపీట వేస్తున్నందునే తెలంగాణకు అనేకమంది వచ్చి కొత్త పార్టీలు పెడుతున్నారని అన్నారు. అదే ఏపీలో వైఎస్ జగన్ పాలనలో పులివెందులలో కొత్త పార్టీని ఎవరైనా పెట్టగలరా? అని ప్రశ్నించారు.
తన పార్టీ ఎజెండా ఏమిటో ప్రజలకు చెప్పాలని, ఏ లక్ష్యం కోసం తెలంగాణలో పాదయాత్ర చేస్తున్నారో ప్రజలకు వివరించాలని షర్మిలను డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్ను లక్ష్యంగా చేసుకొని విమర్శలు చేస్తే బీఆర్ఎస్ కార్యకర్తలు సహించరని హెచ్చరించారు. ‘తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకిస్తూ వైఎస్ జగన్ పార్లమెంట్లో ధర్నా చేయలేదా? తెలంగాణ ఏర్పడితే ఆంధ్రా నుంచి వచ్చే ప్రజలు పాస్పోర్టులు తెచ్చుకోవాలా? అని వైఎస్సార్ నంద్యాల సభలో అనలేదా? అలాంటి చరిత్ర ఉన్న నీవు ఈ రోజున తెలంగాణ బిడ్డనంటూ తిరుగుతుండటం విడ్డూరం. నీవు అన్నట్టుగా మీ నాన్న నిజంగా పులే. కాకపోతే రక్తం తాగే పులి’ అని విమర్శించారు. సమావేశంలో జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు తదితరులు పాల్గొన్నారు.