హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలైన వేములవాడ, బాసర, జోగులాంబ ఆలయాల్లో శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. సోమవారం నుంచి వచ్చేనెల 5 వరకు ఆలయాల్లో మహోత్సవాలు జరుగనున్నాయి. పది రోజుల పాటు రోజుకో అవతారంలో అమ్మవారు భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.
వేములవాడలోని రాజరాజేశ్వరుని ఆలయంలో స్వామి అమ్మవార్లకు ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మొదటిరోజు శైలపుత్రి అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. ఆలయాన్ని రకరకాల పూలతో అలంకరించారు. ఇక చదువుల తల్లి కొలువైన బాసర శ్రీ జ్ఞానసరస్వతి ఆలయంలో, అలంపూర్లోని శక్తిపీఠం జోగులాంబ ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి.
భద్రాచల రాములవారి ఆలయంలో శ్రీదేవి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. నేటి నుంచి అక్టోబర్ 4 వరకు ఉత్సవాలు జరుగనున్నాయి. మొదటిరోజైన నేడు అమ్మవారు ఆదిలక్ష్మి అలంకారంలో ఆర్శనమిచ్చారు.