BJP | సిరిసిల్ల టౌన్, ఆగస్టు 26: తన ఇంటిని బీజేపీ నేతలు అక్రమంగా లాక్కున్నారని రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని విద్యానగర్కు చెందిన ఓ మహిళ బీజేపీ జాతీయ కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్కి శనివారం ఫిర్యాదు చేసింది. సిరిసిల్లలోని సాయికృష్ణ కల్యాణ మండపంలో బీజేపీ నియోజకవర్గ సమావేశానికి బండి సంజయ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా సిరిసిల్ల పట్టణంలోని విద్యానగర్కు చెందిన షమీం సుల్తానా.. బీజేపీ నేతలు రాజాసింగ్, కమలాకర్పై బండి సంజయ్కి ఫిర్యాదు చేసింది.
తంగళ్లపల్లి మండలంలోని టెక్స్టైల్స్ పార్కులో గల తన ఇంటిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారని, తన ఆస్తిని తనకు ఇప్పించి ప్రాణ రక్షణ కల్పించాలని బండి సంజయ్ కాళ్ల మీద పడి వేడుకున్నది. అక్కడే ఉన్న బీజేపీ నాయకులు ఆమెను స్టేజి మీద నుంచి పంపించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. తన కొడుకుతో ఉన్న వివాదాన్ని పరిష్కరిస్తామని నమ్మబలికి తన పేరున ఉన్న ఇంటిని రాజాసింగ్, కమలాకర్ వారి పేరున రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని, సమస్య పరిష్కారం తరువాత తిరిగి తన పేరున రిజిస్ట్రేషన్ చేస్తామని చెప్పి మాట మార్చారని ఆరోపించింది.