జయశంకర్ భూపాలపల్లి : బీజేపీ పాలిత తెలంగాణ సరిహద్దు రాష్ట్రాలు కర్ణాటక, మహారాష్ట్రలలోని ప్రజలు తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులవుతున్నారు. అలాంటి పథకాలు మాకు అమలుచేయండి. లేకపోతే తెలంగాణలో మమ్మల్ని కలపండి అంటుంటే బీజేపీ నేతలు ఇక్కడకు వచ్చి సీఎం కేసీఆర్ను విమర్శించడానికి కొంచెమైనా సిగ్గుండాలని, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ఘాటుగా విమర్శించారు.
జిల్లాలో నిర్వహించిన ఉత్సవాల్లో మంత్రి పాల్గొని మాట్లాడారు. రైతు బంధు పథకం అద్భుమన్నారు. దాదాపు 500 మంది మహిళలు ఈరోజు ఈ ముత్యాల ముగ్గు పోటీల్లో పాల్గొనడం చాలా గొప్ప విషయం అన్నారు. రైతు బంధు ప్రవేశ పెట్టినప్పటి నుంచి 8వా దఫాలలో 50 వేల కోట్ల రూపాయలు ఒక్క పథకం ద్వారా రైతుల ఖాతాల్లో వేసిన గొప్ప నాయకుడు సీఎం కేసీఆర్ అని ప్రశంసించారు.
రైతు చనిపోతే బీమా పథకం పెట్టారు. 5 లక్షల రూపాయలు పెద్ద ఖర్మ ముందే వారి అకౌంట్స్ లో పడుతున్నాయి. ఇంత చేస్తున్నా బీజేపీ నేతలు సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. తెలంగాణలో వలె మాకు సంక్షేమ పథకాలు పెట్టండి..లేకపోతే తెలంగాణలో కలపండి అని డిమాండ్ చేస్తూంటే వారికి ఏమి సమాధానం చెప్తారని సూటిగా ప్రశ్నించారు.
బండి సంజయ్ 10 సార్లు జైలుకు వెళ్లావు. అయినా నీ తీరు మారలేదు. నోరు అదుపులో లేకుండా అడ్డగోలుగా మాట్లాడుతున్నావు . రైతు కడుపు మండితే ప్రధానికి పట్టిన గతి బీజేపీకి పడుతుందన్నారు. తెలంగాణ బీజేపీ నాయకుల్లారా మీకు ఈ గతి పట్టకుండా చూసుకోండని హితవు పలికారు.
అనంతరం పోటీల్లో పాల్గొన్న వారికి జ్ఞాపికలు, చీరలు ప్రదానం చేశారు. కార్యక్రమంలో ఎంపీ దయాకర్, జెడ్పీ చైర్ పర్సన్ గండ్ర జ్యోతి, ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, రైతు బంధు జిల్లా అధ్యక్షుడు పల్లా బుచ్చయ్య, తదితరులు పాల్గొన్నారు.