న్యూడ్ వీడియోలతో రెచ్చగొట్టి.. ఆపై ఎదుటివారి వీడియో రికార్డు చేసి బెదిరింపులు
తెలంగాణలో పెరుగుతున్న సెక్స్టార్షన్ కేసులు
మెసేజ్లు, ఈమెయిల్స్తో వలవేస్తున్న సైబర్ గ్యాంగ్లు
అందినకాడికి డబ్బులు గుంజుతున్న కేటుగాళ్లు
సోషల్ మీడియా ప్రొటెక్షన్ తప్పనిసరి అంటున్న సైబర్క్రైం పోలీసులు
సెక్స్టార్షన్ అంటే?
లైంగిక సేవలు అందిస్తామంటూ మభ్యపెట్టడం. కాల్ఫర్ టైంపాస్ అంటూ ఆకర్షించి తమ శరీరభాగాలు చూపిస్తూ.. అదేవిధంగా బాధితులను చేయాలని కోరతారు. అలా బాధితుడి వ్యక్తిగత అంశాలు, వీడియోలు, ఫొటోలు సేకరించి(దుస్తులు లేకుండా ఉండేవి) వాటిని బహిర్గతం చేస్తామంటూ బెదిరిస్తూ బాధితుడి నుంచి డబ్బులు వసూలు చేయడం.
హైదరాబాద్, జూన్ 6 (నమస్తే తెలంగాణ): ఫోన్లో ‘హాయ్..’ అంటూ హస్కీవాయిస్లో అమ్మాయి పలుకరిస్తుంది. మీతో కాసేపు మాట్లాడొచ్చా అంటూ మాట కలుపుతుంది. ఫేస్బుక్లో చాటింగ్ స్టార్ట్ చేస్తుంది. కాసేపటికి ‘వ్యక్తిగత’ విషయాల్లోకి దింపుతుంది. తర్వాత అసభ్యంగా ప్రవర్తిస్తూ రెచ్చగొడుతుంది..‘మీరు నాలా చేయండి…’ అంటూ కవ్విస్తుంది..సీన్ కట్ చేస్తే..కాసేపటికి ఫేస్బుక్లో..లేదంటే వాట్సాప్కు అశ్లీలంగా ఉన్న ఫొటోను పంపుతారు..అడిగినంత డబ్బులు ఇవ్వకపోతే వీటిని మీ ఫేస్బుక్ ఖాతాలోని వారందరికీ పంపుతామంటూ బెదిరింపులకు దిగుతారు. ఈ తరహా ‘సెక్స్టార్షన్’ కేసులు ఇటీవల పెరుగుతున్నాయని సైబర్ క్రైం పోలీసులు చెప్తున్నారు. దేశవ్యాప్తంగా రోజుకు 500 వరకు కేసులు ఈ తరహావే నమోదవుతున్నట్టు సైబర్ క్రైం గణాంకాలు చెబుతున్నాయి.
ఇలా ‘వల’ వేస్తున్నారు..
ప్రధానంగా లాక్డౌన్ సమయం నుంచి ఈ తరహా నేరాలు క్రమంగా పెరుగుతూ వస్తున్నట్టు పోలీసులు చెప్తున్నారు. ఒంటరిగా ఉండటంతో చాలామంది ఈ తరహా సెక్స్ ఎస్కార్ట్ సర్వీస్ల వైపు ఆకర్షితులవుతున్నారు. ఆన్లైన్ సెక్స్ చాట్ చేయడం.. కాసేపు ‘ఆ తరహా’ అంశాలు మాట్లాడి ఊరట పొందడం వంటివి పెరిగాయి. క్రమంగా దీన్నే సైబర్ నేరగాళ్లు ఇప్పుడు అస్త్రంగా మార్చుకున్నారు. దీనిలో మొత్తం మూడు రకాలు ఉన్నట్టు ఓ సీనియర్ పోలీస్ అధికారి తెలిపారు. బాధితుడే స్వయంగా ఆన్లైన్లో ఎస్కార్ట్ (లైంగిక సేవలు అందించేవి) వెబ్సైట్లలో కాంటాక్ట్ చేసి, వారి వలలో పడి మోసపోవడం. రెండోది…కొందరు సైబర్ నేరగాళ్లు ఎస్కార్ట్ సేవలందిస్తాం.. అంటూ ఊరిస్తూ గ్రూప్ మెసేజ్లు, ఈమెయిల్స్ పంపుతుంటారు. అందులో ఎవరైతే స్పందిస్తారో వాళ్లతో చాటింగ్లు, వీడియో కాల్స్ చేస్తూచివరకు వారి నగ్న చిత్రాలు, వీడియోలు క్యాప్చర్ చేసి వాటితో బెదిరిస్తున్నారు. ఇక మూడో రకం.. మన ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా ఖాతాల్లోకి అన్ప్రొటెక్టెడ్గా ఉన్నవి ఎంచుకుంటారు. వచ్చి వాటిల్లోని వివరాలు తెలుసుకుని, వాటి ఆధారంగా వల వేస్తున్నారు. లేదంటే మన పేరు, ఫొటోలు వాడి ఫేక్ ఫ్రొఫైల్ క్రియేట్ చేసి వాటి ద్వారా మోసాలకు తెరతీస్తున్నారు.
స్థానికుల నుంచి ఎన్నారైల వరకు అందరూ బాధితులే..
సెక్టార్షన్కు పాల్పడుతున్న ముఠాలు స్థానికుల నుంచి ఎన్నారైల వరకు అందరినీ టార్గెట్ చేస్తున్నాయి. ఇలాంటి ‘సెక్స్టార్షన్’ కేసుల్లో బాధితులు తీవ్ర ఒత్తిడికి లోనవుతుంటారు. తమ ఫొటోలు, వీడియోలు బయటికి వస్తే సొసైటీలో చెడ్డపేరు వస్తుందన్న ఆందోళనలో సైబర్ నేరగాళ్లు అడిగినంత డబ్బు పంపుతుంటారు. ఈ తరహాలో కొందరు ఎన్నారైలు సైతం మోసపోయారు. బాధితులు మమ్మల్ని సంప్రదించడంతో ధైర్యం చెప్పి.. సైబర్క్రైం పోర్టల్ ద్వారా ఫిర్యాదు చేయించి.. కేసులు నమోదు చేశాం’ అని సైబర్ క్రైం విభాగంలో పనిచేస్తున్న ఓ సీనియర్ అధికారి తెలిపారు. మరో ఘటనలో ఒక టీనేజ్ వ్యక్తికి సంబంధించి ఖాతాలోంచి వారి బంధువుల్లో ఒక మహిళా ఫొటో క్యాప్చర్ చేసి వాటిని అసభ్య చిత్రాలకు జోడించి వాటిని సోషల్ మీడియాలో పెడతామంటూ కూడా బెదిరింపులకు పాల్పడిన ఘటనలు నమోదవుతున్నట్టు తెలిపారు.
వలలో చిక్కినా..ఆందోళన వద్దు
సెక్స్టార్షన్కు గురిచేసే ముఠాల చేతికి చిక్కినా ఆందోళన వద్దని పోలీసులు సూచిస్తున్నారు. సైబర్ నేరగాళ్లు వ్యక్తిగతంగా మిమ్మల్ని టార్గెట్ చేయరని, గ్రూప్గా పంపే మెసేజిల్లో ఎవరు స్పందిస్తే వాళ్లను టార్గెట్ చేస్తారని చెప్తున్నారు. సైబర్ నేరగాళ్లు బెదిరించినప్పుడు మనం డబ్బులు పంపినంత మాత్రాన వాళ్లు మనల్ని వదిలేస్తారన్న గ్యారెంటీ లేదని అంటున్నారు. అందుకే ఆందోళన చెందకుండా ప్రశాంతంగా ఉంటూ, పోలీసులకు సమాచారం ఇవ్వడమే మేలని సూచిస్తున్నారు..
ఈ ట్రిక్ మరవొద్దు
సెక్స్టార్షన్కు దిగే ముఠాల నుంచి మెసేజ్లు, కాల్స్ వచ్చే నంబర్లను బ్లాక్ చేయాలని పోలీసులు సూచిస్తున్నారు. అయితే ఆ నంబర్ను బ్లాక్ చేసే ముందు మీరు సైబర్ క్రైం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామని, ఆ క్రైం స్టేషన్ ఫలానా చోట ఉందని ఆ అడ్రస్ కాంటాక్ట్ నంబర్లతో సహా పెట్టాలి. అలా చేయడం వల్ల ఆ సైబర్ నేరగాళ్లు నిజంగానే మీరు ఫిర్యాదు చేశారన్న చోట స్టేషన్ ఉందో లేదో సరిచూసుకుని వెనక్కి తగ్గే అవకాశం ఉంటుంది. అదేవిధంగా సైబర్ క్రైం పోర్టల్లో ఫిర్యాదు చేసిన విషయాన్ని మెసేజ్ చేసి మరీ నంబర్ బ్లాక్ చేయాలని సూచిస్తున్నారు.
సోషల్ మీడియా ప్రొటెక్షన్ తప్పనిసరి..
ఎక్కువగా ఫేస్బుక్ ద్వారానే మన ఫొటోలు, వీడియోలు, ఇతర సమాచారం లీక్ అయ్యే అవకాశం ఉంటున్నది. ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ వంటి సోషల్ మీడియా ఖాతాలు సైతం ఇదే తరహాలో సైబర్ నేరగాళ్లకు అవకాశంగా మారుతున్నాయి. సోషల్మీడియా ఖాతాలు వాడే ప్రతి ఒక్కరూ విధిగా తమ ప్రొఫైల్, ఫొటోలు, వివరాలను ప్రొటెక్ట్ చేసుకోవాలని సైబర్ క్రైం పోలీసులు సూచిస్తున్నారు. ప్రతి సోషల్ మీడియా వేదికలోనూ సెట్టింగ్స్లోకి వెళితే సెక్యురిటీ ఫీచర్స్ ఉంటాయని, వాటిని ఎనేబుల్ చేసుకోవాలని సూచిస్తున్నారు. అదేవిధంగా మన ఫ్రొఫైల్ఫిక్ సహా ఫొటోలు ఎవరెవరు చూడాలన్నది కూడా మనచేతుల్లోనే ఉంటుందని, ఆ తరహాలో ప్రొటెక్షన్ తప్పనిసరిగా పెట్టుకోవాలని సూచిస్తున్నారు.