మాల్/అడ్డగూడూరు, సెప్టెంబర్ 20: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో బుధవారం వేర్వేరు చోట్ల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఏడుగురు దుర్మరణం చెందారు. నల్లగొండ జిల్లా చింతపల్లి మండలం నసర్లపల్లి గేట్ సమీపంలో కారు, బైక్ ఢీకొన్న ప్రమాదంలో ఐదుగురు చనిపోయారు. మృతుల్లో ఇద్దరు విద్యార్థులు, ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఉన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండలం బొడ్డుగూడెం శివారులో ఆర్టీసీ బస్సు బోల్తాపడిన ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా.. ఏడుగురు గాయాలపాలయ్యారు. నల్లగొండ జిల్లా పీఏపల్లి మండలం అక్కంపల్లికి చెందిన మద్దిమడుగు ప్రసాద్(38) కారు డ్రైవర్గా పనిచేస్తూ కుటుంబంతో కలిసి హైదరాబాద్లో జీవిస్తున్నాడు. తన పెద్ద కుమారుడిని దవాఖానలో చూపించేందుకు బైక్పై స్వగ్రామానికి వస్తున్నాడు. అదే సమయంలో చింతపల్లి మండలం కురంపల్లికి చెందిన పట్నం మణిపాల్(18), వనం మల్లికార్జున్(18)తోపాటు పులి పవన్, వరాల మణి ప్రయాణిస్తున్న కారు.. చింతపల్లి మండలం నసర్లపల్లి గేట్ సమీపంలోకి రాగానే ప్రసాద్ బైక్ను ఢీకొట్టి బోల్తాపడింది.
ఈ ప్రమాదంలో ప్రసాద్, ఆయన భార్య రమణమ్మ(35), కుమారుడు అవినాశ్(12)తోపాటు.. కారులోని మణిపాల్, మల్లికార్జున్ మృతి చెందారు. కారులో ఉన్న మరో ఇద్దరిని చికిత్స నిమిత్తం హైదరాబాద్కు తరలించారు. తండ్రి, తల్లి, అన్న మృతి చెందడంతో చిన్న కుమారుడు అనాథగా మారాడు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం దేవరకొండ ప్రభుత్వ దవాఖానకు తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై సతీశ్రెడ్డి తెలిపారు. మరో ఘటనలో.. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు డిపోకు చెందిన (ఏపీ 36 జెడ్ 0197) ఆర్టీసీ బస్సు 33 మంది ప్రయాణికులతో ఉదయం 10 గంటలకు తొర్రూరు నుంచి జగద్గిరిగుట్టకు బయల్దేరింది. బొడ్డుగూడెం దాటాక అతివేగంతో వెళ్తున్న బస్సు అదుపుతప్పతి రోడ్డు పక్కనే ఉన్న కాల్వలో పడిపోయింది. ఈ ఘటనలో మండలంలోని చిన్నపడిశాలకు చెందిన చుక్క యాకమ్మ(48), కోటమర్తిలో పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్న కొండ రాములు(60) అక్కడికక్కడే మృతి చెందారు. మృతదేహాలను పోస్టుమార్టు నిమిత్తం రామన్నపేట ప్రభుత్వ దవాఖానకు తరలించారు. మరో ఏడుగురికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని గాయాలైన చుక్క సుమలత, చుక్క అవిలమ్మ, చుక్క సోమక్క, అల్లె కల్పనను అంబులెన్స్లో సూర్యాపేట జిల్లా తిరుమలగిరికి, మౌనిక, వేణు, కుమార్స్వామిని సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఏరియా దవాఖానకు తరలించారు.