హైదరాబాద్, జనవరి31 (నమస్తే తెలంగాణ): అసెంబ్లీ ఆవరణలో మహా త్మా జ్యోతిరావు ఫూలే విగ్రహ ఏర్పాటు విషయాన్ని రాజకీయం చేయొద్దని పద్మశాలి సంఘం జాతీయ రాజకీయ విభాగం అధ్యక్షుడు బోల్ల శివశంకర్ ఒక ప్రకటనలో ప్రభుత్వానికి హితవు పలికారు. విగ్రహ ఏర్పాటు విషయాన్ని ఎవరు ప్రతిపాదిస్తే ఏమిటని, ప్రభుత్వం చొరవ తీసుకొని విగ్రహాన్ని ఏర్పా టు చేయాలని డిమాండ్ చేశారు. విగ్రహ ఏర్పాటును ప్రతిపాదించిన ఎమ్మెల్సీ కవితపై మంత్రి పొన్నం ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలు సరికాదని పేర్కొన్నారు. అసలు ఫూలే విగ్రహ ఏర్పాటుపై ప్రభుత్వం తన వైఖరిని స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీ కవిత ప్రతిపాదన ఏమైనా ఆటంకమా? అదేమైనా అడగరాని విషయమా? అని ప్రశ్నించారు. ఉమ్మడి ఏపీగా ఉన్నప్పుడు అసెంబ్లీ ఆవరణలో అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుకు ఆనాడు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలిగా కవిత విజ్ఞప్తి మేరకు విగ్రహాన్ని ఏర్పాటు చేసి, కవిత చొరవను అభినందించారని తెలిపారు. నేడు ఎమ్మెల్సీ అయిన కవిత అసెంబ్లీ ప్రాంగణంలో అణగారిన వర్గాల స్ఫూర్తి ప్రదాత ఫూలే విగ్రహాన్ని నెలకొల్పాలని కోరడంలో తప్పేమిటని పేర్కొన్నారు.