మీరు ఈ ఆనందాన్ని, ఈ సంతోషాన్ని పదిలంగా పెట్టుకోండి. కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి అయ్యే దాకా ఈ చప్పట్లు మోగుతూనే ఉండాలె. కేసీఆర్ను మూడోసారి ముఖ్యమంత్రిని చేయడమే మీరు ఆయనకు చెప్పే నిజమైన కృతజ్ఞత. పల్లెలను కదిలించండి. కేసీఆర్ చేసిన పనులు, ప్రభుత్వ కార్యక్రమాలను వివరించండి.
-సెర్ప్ ఉద్యోగుల కృతజ్ఞత సభలో మంత్రి హరీశ్రావు
Harish rao | హైదరాబాద్, ఏప్రిల్ 15 (నమస్తే తెలంగాణ): ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి, బీఆర్ఎస్ తొమ్మిదేండ్ల పాలనలో జరిగిన అభివృద్ధిపై గ్రామాల్లో చర్చకు పెట్టి, స్వరాష్ట్రంలో ప్రజలకు జరిగిన మేలును వివరించాలని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి టీ హరీశ్రావు సెర్ప్ ఉద్యోగులకు పిలుపునిచ్చారు. సెర్ప్ ఉద్యోగుల రెండు దశాబ్దాల డిమాండ్ పేస్కేల్ను నెరవేర్చిన కేసీఆర్ను మూడోసారి ముఖ్యమంత్రిగా చేసే వరకు ఇదే ఉత్సాహం, కృతజ్ఞతతో పనిచేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం సెర్ప్ ఉద్యోగులకు పేస్కేల్ ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో శనివారం గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో సెర్ప్ ఉద్యోగులు కృతజ్ఞత సభ నిర్వహించారు. ఈ సభకు ముఖ్య అతిథులుగా మంత్రులు హరీశ్రావు, ఎర్రబెల్లి దయాకర్రావు, సబితా ఇంద్రారెడ్డి, సత్యవతిరాథోడ్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నందుకు ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం నాలుగు వేల మంది సెర్ప్ ఉద్యోగులను తొలగిస్తే.. కేసీఆర్ పోరాడి ఆయా ఉద్యోగాలను తిరిగి ఇప్పించారని గుర్తు చేశారు. రెండు దశాబ్దాల పేస్కేల్ కల కరోనా వల్ల కొంత ఆలస్యమైనా ఇప్పుడు నెరవేరిందని చెప్పారు. సెర్ప్ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. సెర్ప్ ఉద్యోగులతో గత ప్రభుత్వాలు వెట్టి చాకిరి చేయించుకున్నాయని మండిపడ్డారు. రాయిని కూడా కరిగించే శక్తి సెర్ప్ ఉద్యోగులకు ఉన్నదని కొనియాడారు. సెర్ప్ ఉద్యోగుల పనితీరుకు కేంద్రం ఇచ్చిన అవార్డులే నిదర్శనమని తెలిపారు. క్షేత్రస్థాయిలో ప్రజలకు వాస్తవాలు చెప్పాలని, బీజేపీ లాగా అబద్ధాలు, గోబెల్స్ ప్రచారాలు వద్దని సూచించారు. 2015లో రూ.3,200 కోట్ల విలువైన ధాన్యం కొనుగోలు చేస్తే 2022లో రూ.26,700 కోట్ల విలువైన ధాన్యం మహిళా సంఘాల ద్వారా కొనుగోలు చేశామని వివరించారు. తెలంగాణలో రైతుల ఆర్థిక పరిస్థితులు మెరుగుపడ్డాయని, అసరా పింఛన్తో వృద్ధుల గౌరవం పెరిగిందని పేర్కొన్నారు.
ప్రజాసమస్యలు లేకనే వ్యక్తిగత విమర్శలు
‘కరెంటు ఫుల్లు, నీళ్లు ఫుల్లు, చేపలు ఫుల్లు, తెలంగాణ పవర్ఫుల్లు, మళ్లీ కేసీఆరే రావాలి’ అంటూ ఆందోల్లో ఒక రైతు అన్నారని హరీశ్రావు గుర్తుచేసుకున్నారు. ప్రతిపక్షాలకు ప్రజా సమస్యలు లేకపోవడంతో వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారని దుయ్యబట్టారు. తెలంగాణ పథకాలను కేంద్రంలోని బీజేపీ కాపీ కొట్టి అమలు చేస్తున్నదని, ఒకవైపు అవార్డులు ఇస్తూనే మరోవైపు విమర్శిస్తున్నదని దుయ్యబట్టారు. మోటర్లకు మీటర్లు పెట్టకపోవడంతో రూ.30 వేల కోట్లు, ఎఫ్ఆర్బీఎం కింద రావాల్సిన రూ.15 వేల కోట్లు మొత్తంగా రూ.45 వేల కోట్లు కేంద్రం ఇవ్వకపోయినా సెర్ప్ ఉద్యోగులకు ఇచ్చిన మాటను రాష్ట్ర ప్రభుత్వం నిలబెట్టుకున్నదని వివరించారు. వడ్డీ లేని రుణాలకు కేంద్రం తన రాయితీ వాటాను ఆరేడు ఏండ్లుగా ఇవ్వట్లేదని ఆరోపించారు. తెలంగాణ పట్ల కేంద్ర ప్రభుత్వ వైఖరిని ప్రజలకు వివరించాలని సూచించారు. ఉమ్మడి రాష్ట్రంలో మాదిరిగా తెలంగాణలో మంచినీటి సమస్య, కరెంటు సమస్యలు లేవని, పల్లెప్రగతితో గ్రామాల రూపురేఖలు మారిపోయాయని, మండుటెండల్లో సైతం చెరువులు అలుగులు దుంకుతున్నాయని వివరించారు. ప్రతిపక్షాల కంటే వేగంగా ఆలోచించే కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండటం వల్లనే అభివృద్ధిలో దూసుకుపోతున్నామని చెప్పారు. కులాల కుమ్ములాటలు, మతాల మంటలు పెట్టే వారి చేతిలో రాష్ర్టాన్ని పెట్టి నష్టపోయేవిధంగా చేయవద్దని సూచించారు.
అందరి అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం: సబితారెడ్డి
తెలంగాణలోని ప్రతి కుటుంబం, ప్రతి వ్యక్తి ఆర్థికంగా ఎదగాలన్న లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తున్నదని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి చెప్పారు. పంచాయతీరాజ్ శాఖ ద్వారా 50 లక్షలకుపైగా ఇండ్లకు ఇంటింటికీ నల్లానీళ్లు, 45 లక్షల మందికి ఆసరా పింఛన్లు, 46 లక్షల మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులకు రుణాలు, ఇతర కార్యక్రమాలు అమలు చేస్తున్నామని వివరించారు.
సెర్ప్ ఉద్యోగుల జీవితాల్లో నిజమైన వెలుగు: సత్యవతి రాథోడ్
తెలంగాణలో ఉద్యోగులతో సహా అన్ని వర్గాలకు స్వర్ణయుగం నడుస్తున్నదని స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ ప్రభుత్వ ఉద్యోగులతోపాటు అవుట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులకు సైతం పీఆర్సీని అమలు చేశారని చెప్పారు. సెర్ప్ ఉద్యోగుల జీవితాల్ల్లో పేస్కేల్ అమలు ద్వారా నిజమైన వెలుగు ఇప్పుడు వచ్చిందని చెప్పారు. ఉద్యోగులకు తెలంగాణలో కంటే బీజేపీ రాష్ర్టాల్లో ఎక్కడైనా ఎక్కువ వేతనాలు ఇస్తే చెప్పాలని సవాల్ చేశారు.
పోల్చి చూడండి: ఎర్రబెల్లి
గత ప్రభుత్వాలతో బీఆర్ఎస్ ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను పోల్చి చూడాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు కోరారు. ప్రజల గురించి ఆలోచన చేసిన ముఖ్యమంత్రులు నాడు ఎన్టీఆర్, నేడు కేసీఆర్ మాత్రమేనని చెప్పారు. సెర్ప్ ఉద్యోగులకు తెలంగాణలో మినహా మరే రాష్ట్రంలోనూ పేస్కేల్ అమలు కాలేదని పేర్కొన్నారు. కేసీఆర్ మనసున్న మారాజు అని, ఆయనకు సెర్ప్ ఉద్యోగులు అండగా నిలవాలని కోరారు.
మార్మోగిన చప్పట్లు
సెర్ప్ ఉద్యోగులు ఆనందాన్ని, సంతోషాన్ని, ప్రభుత్వానికి తమ మద్దతును చప్పట్ల ద్వారా తెలియజేశారు. దశాబ్దాల కోరికను సీఎం కేసీఆర్ నెరవేర్చినందుకు సెర్ప్ ఉద్యోగులు ఉద్విగ్నభరిత వాతావరణంలో దాదాపు అరగంటపాటు చప్పట్లను మోగిస్తూనే ఉన్నారు. ఉద్యోగులు తమ స్థానాల నుంచి లేచి నిలబడి సీఎం కేసీఆర్కు, కార్యక్రమానికి హాజరైన మంత్రులకు ధన్యవాదాలు తెలియజేశారు. సీఎం కేసీఆర్ చిత్రపటానికి మంత్రులు హరీశ్రావు, దయాకర్రావు, సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్తో కలిసి ఉద్యోగులందరూ క్షీరాభిషేకం చేశారు. మంత్రులు హరీశ్రావు, దయాకర్రావును గజమాలతో సత్కరించారు. కార్యక్రమంలో సెర్ప్ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ కుంట గంగారెడ్డి, సెర్ప్ ఉద్యోగ సంఘాల నాయకులు నర్సయ్య, మహేందర్రెడ్డి, శ్రీనివాస్, రవీందర్, మధు, సురేఖ, సుదర్శన్, సంపత్, సుభాష్, వివిధ జిల్లాల నుంచి తరలివచ్చిన నాలుగు వేల మంది సెర్ప్ ఉద్యోగులు పాల్గొన్నారు.
కేసీఆర్ రుణం తీర్చుకుంటాం
రెండు దశాబ్దాలకుపైగా పెండింగ్లో ఉన్న సెర్ప్ ఉద్యోగుల డిమాండ్ను నెరవేర్చిన దేవుడు కేసీఆర్. సెర్ప్ ఉద్యోగుల తరపున సీఎం కేసీఆర్కు ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఆయనకు జీవితాంతం రుణపడి ఉంటాం. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నందుకు సెర్ప్ ఉద్యోగులను ఉమ్మడి పాలకులు తీసివేశారు. అనాటి నుంచి ఈనాటి వరకు కేసీఆర్తో మా బంధం కొనసాగుతున్నది. కేసీఆర్ను మరోసారి సీఎంగా చేసేందుకు సెర్ప్ ఉద్యోగులందరం కలిసికట్టుగా పనిచేసి కృతజ్ఞతను చాటుకుంటాం.
-సెర్ప్ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ కుంట గంగారెడ్డి