హైదరాబాద్, ఫిబ్రవరి 10 (నమస్తే తెలంగాణ): కేఆర్ఎంబీ ద్వారా తెలంగాణకు భవిష్యత్తులో జరగబోయే అతి భయంకరమైన నష్టాన్ని దృష్టిలో పెట్టుకొని కాపాడుకోవడానికి వెంటనే ప్రజాప్రతినిధులు ఐక్యంగా ప్రయత్నాలు ప్రారంభించాలని సీనియర్ జర్నలిస్టులు పాశం యాదగిరి, గాదె ఇన్నారెడ్డి కోరారు.
విభజన చట్టాన్ని అడ్డుపెట్టుకొని దేశంలో ఏ నది మీద ఏర్పాటు చేయనన్ని ఆంక్షలతో కృష్ణా నదిని పూర్తిగా తమ స్వాధీనంలోకి తెచ్చుకోవాలనే కేంద్రం కుట్రను తిప్పికొట్టాలని కోరారు. అనవసరమైన రాజకీయ గందరగోళాన్ని పక్కనపెట్టి కృష్ణా పరివాహక ప్రాంతం పూర్తిగా ఎడారి కాకుండా జాగ్రత్త పడాలన్నారు. కేంద్రం కుట్రను వ్యతిరేకిస్తూ ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే తీర్మానం చేయాలని విజ్ఞప్తిచేశారు. అసెంబ్లీ సమావేశాలు ముగియగానే అఖిలపక్షం ఏర్పాటు చేసి ఢిల్లీకి వెళ్లి ప్రధానిని కలవాలని కోరారు.