హైదరాబాద్, ఫిబ్రవరి 25 (నమస్తే తెలంగాణ): తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్గా సీనియర్ జర్నలిస్ట్ కే శ్రీనివాస్రెడ్డి నియమితులయ్యారు. రెండేండ్లపాటు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ (ఐజేయూ) అధ్యక్షునిగా చిరపరిచితులైన శ్రీనివాస్రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో టీడీపీ హయాంలో 1996లో ప్రెస్ అకాడమీని ఏర్పాటు చేసినప్పుడు తొలి చైర్మన్గా వ్యవహరించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత ప్రెస్ అకాడమీ పేరును మీడియా అకాడమీగా మార్చిన విషయం తెలిసిందే.
తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్గా శ్రీనివాస్రెడ్డి నియమితులవడం ఇది రెండోసారి. ఉమ్మడి నల్లగొండ జిల్లా పల్లెపహాడ్ గ్రామానికి చెందిన కలిమికొలన్ శ్రీనివాస్రెడ్డి సీపీఐ అనుబంధ విద్యార్థి సంఘం ఏఐఎస్ఎఫ్ నాయకునిగా పని చేశారు. ‘విశాలాంధ్ర’ దిన పత్రిక స్టాఫ్ రిపోర్టర్గా పత్రికా రంగంలోకి ప్రవేశించి ఆ పత్రికలో ఎడిటర్ స్థాయికి ఎదిగారు. దాదాపు ఐదు దశాబ్దాల నుంచి పత్రికా రంగంలో కొనసాగుతున్న శ్రీనివాస్రెడ్డి జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర, జాతీయ నాయకునిగా అనేక పదవులు నిర్వహించారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ అధ్యక్షునిగా, ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ ప్రధాన కార్యదర్శిగా, రెండు పర్యాయాలు ప్రెస్ కౌన్సిల్ ఇండియా సభ్యునిగా పని చేశారు. ప్రస్తుతం ‘ప్రజాపక్షం’ పత్రికకు ఎడిటర్గా పనిచేస్తున్న శ్రీనివాస్రెడ్డి మరోసారి తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్గా నియమితులవడంపై జర్నలిస్టు సంఘాల నాయకులు, పలువురు సీనియర్ జర్నలిస్టులు హర్షం వ్యక్తం చేశారు.