హైదరాబాద్, నవంబర్ 23 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ వేదికగా ఆచార్య నాగార్జునుడిపై అంతర్జాతీయ సదస్సును నిర్వహించేందుకు సమాలోచనలు చేస్తున్నామని మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. అంతర్జాతీయ బౌద్ధ సమాఖ్యకు చెందిన 24 మం ది బౌద్ధ ప్రతినిధుల బృందం బుధవారం హైదరాబాద్లోని పర్యాటకభవన్లో మంత్రి శ్రీనివాస్గౌడ్తో సమావేశమైంది. తెలంగాణ సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తూ బౌద్ధ భిక్షువులు తొలుత ప్రత్యేకంగా ప్రార్థనలు చేశారు. అనంతరం భూటాన్-తెలంగాణ పర్యాటకశాఖల ఆధ్వర్యంలో ఆచార్య నాగార్జునుడిపై అంతర్జాతీయ స్థాయి సెమినార్ను హైదరాబాద్ వేదికగా నిర్వహించే అంశంపై మంత్రితో చర్చించారు.
ఈ సందర్భంగా శ్రీనివాస్గౌడ్ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ దిశానిర్దేశంలో నల్లగొండ జిల్లాలోని ప్రముఖ బౌద్ధ ఆధ్యాత్మిక కేంద్రం, ఆచార్య నాగార్జునుడు నడయాడిన నాగార్జునసాగర్లో బుద్ధవనాన్ని అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో తీర్చిదిద్దామని వివరించారు. బుద్ధవనంలో అంతర్జాతీయ స్థాయిలో బౌద్ధ ఆరామాల నిర్మాణం కోసం తైవాన్, ఇండోనేషియా, మంగోలియా, బెంగళూరుల్లోని మహాబోధి సొసైటీకి చెందిన బౌద్ధ సంస్థలు సంప్రదించాయని వెల్లడించారు. నాగార్జునుడు బోధించిన బుద్ధిజం సిద్ధాంతాలు ఇప్పటికీ ప్రపంచంలో అనేక దేశాల్లో ఆచరణలో ఉన్నాయని పేర్కొన్నారు. భూటాన్కు చెం దిన అంతర్జాతీయ బుద్ధిస్ట్ సమాఖ్య తెలంగాణ ప్రభుత్వంతో సాంస్కృతిక, ఆధ్యాత్మిక, ఆర్థిక సంబంధాలను మెరుగు పరుచుకోవడానికి ఆసక్తిగా ఉన్నదని చెప్పారు. సమావేశంలో బుద్ధవనం ప్రాజెక్ట్ స్పెషల్ ఆఫీసర్ మల్లేపల్లి లక్ష్మయ్య, పర్యాటకశాఖ ఎండీ మనోహర్, సుద్దాల సుధాకర్ తేజ తదితరులు పాల్గొన్నారు.