హైదరాబాద్, జూలై 14 (నమస్తే తెలంగాణ): దళితబంధు రెండో విడత లబ్ధిదారుల ఎంపిక బాధ్యత కలెక్టర్లదేనని సాంఘిక సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ వెల్లడించారు. కరీంనగర్లోని తన క్యాంపు కార్యాలయం నుంచి శుక్రవారం అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. దళితబంధు పథకం అమలు అంశాలపై వారికి దిశానిర్దేశం చేశారు. కలెక్టర్లతో జిల్లా మంత్రులు చర్చించి లబ్ధిదారుల ఎంపికపై నిర్ణయం తీసుకుంటారని మంత్రి ఈశ్వర్ వివరించారు. ఈ పథకం అమలుపై ఎవరూ ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని, పారదర్శకంగా అమలవుతున్నదని స్పష్టం చేశారు. లబ్ధిదారుల ఎంపికలో అవకతవకలు జరుగుతున్నట్టు వస్తున్న ఆరోపణలు అవాస్తవాలని, మార్గదర్శకాల ప్రకారమే ఎంపిక జరుగుతున్నదని చెప్పారు. రెండోవిడత కోసం ఇప్పటికే రూ.850 కోట్లను ప్రభుత్వం విడుదల చేసిందని గుర్తుచేశారు. దశలవారీగా రాష్ట్రంలోని ప్రతి దళిత కుటుంబానికీ పథకం వర్తింపజేసే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతున్నదని వివరించారు. కాన్ఫరెన్స్లో రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ సెక్రటరీ రాహుల్ బొజ్జా, అన్ని జిల్లాల కలెక్టర్లు పాల్గొన్నారు.