హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 25 (నమస్తే తెలంగాణ): రైతులను మోసం చేసేందుకు నకిలీ విత్తనాల ముఠా చేస్తున్న భారీ కుట్రను సైబరాబాద్ ఎస్వోటీ పోలీసులు భగ్నం చేశారు. నకిలీ విత్తనాలతో వెళ్తున్న లారీని పట్టుకోవడమే కాకకుండా, అక్కడ లభించిన సమాచారంతో గోడౌన్లపై దాడులు చేసి రూ. 2.07 కోట్ల విలువైన నకిలీ విత్తనాలను స్వాధీనం చేసుకొని, ఏడుగురిని అరెస్ట్ చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ శుక్రవారం మీడియాకు వెల్లడించారు. మేడ్చల్ అతెవెల్లికి చెందిన షేక్ కాలేష్ వలీ ఏటా మార్కెట్ ట్రెండ్ను బట్టి అధికంగా అమ్ముడుపోయే విత్తనాల సమాచారాన్ని సేకరిస్తుంటాడు.
పెద్ద కంపెనీల పేర్లతో ప్యాకెట్లు తయారుచేసి, వాటిలో నకిలీ విత్తనాలు పెట్టి తన ఏజెంట్ల ద్వారా మార్కెట్లోకి సరఫరా చేస్తుంటాడు. ఈ క్రమంలో నకిలీ విత్తనాల సరఫరాపై నిఘా పెట్టిన శంషాబాద్ ఎస్వోటీ పోలీసులు శుక్రవారం షాద్నగర్ టోల్గేట్ వద్ద ఏపీ39 టీజె9924 నంబర్ లారీలో తీసుకెళ్తున్న 1.5 టన్నుల బీజీ 2 పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకొన్నారు. కర్నూల్ జిల్లాకు చెందిన కనాల మహేశ్, గద్వాల్ జిల్లాకు చెందిన గొల్లపెద్ద దొడ్డన్న, చాకలి జయన్నలను అరెస్ట్ చేశారు. వారిచ్చిన సమాచారంతో బాలానగర్ ఎస్వోటీ పోలీసులు ప్రధాన నిందితుడైన షేక్ కాలేష్వలీ గోడౌన్లో 1.54 టన్నుల బీజీ 3 కాటన్ పేరుతో ఉన్న నకిలీ విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. కాలేష్వలీతోపాటు అతనికి సహకరిస్తున్న పుల్యాల రవి, పెద్ది పూర్ణచందర్, షేక్ గౌస్ ఆజమ్లను అరెస్ట్ చేసినట్టు సజ్జనార్ సీపీ తెలిపారు.
మేడ్చల్ ప్రాంతంలో ఉన్న గుబ్బకోల్డ్ స్టోరేజ్పై దాడి చేసిన పోలీసులు 14.4 టన్నుల మక్కజొన్న, వరి, సజ్జ విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ విత్తనాలకు గడువు తీరినా రైతులకు విక్రయించేందుకు ఇన్విక్టా అగ్రిటెక్ ఇండియా నిర్వాహకుడు ఆంజనేయులు, డెక్కన్ కోర్ క్రాప్స్ సైన్స్ నిర్వాహకులు సుభ్రమణ్యం ప్రయత్నించినట్టు సీపీ వెల్లడించారు. నకిలీ విత్తనాలు, గడువు తీరిన విత్తనాలు మొత్తం 17.48 టన్నులున్నట్టు తెలిపారు.