సిటీబ్యూరో, ఏప్రిల్ 23(నమస్తే తెలంగాణ): పెరుగుతున్న రోగాలు, తగ్గుతున్న వ్యాధి నిరోధకత కారణంగా మొండి వ్యాధులపై సమర్థవంతంగా పనిచేసే ఔషధాలకు ప్రాధాన్యత పెరిగింది. ఈ క్రమంలో రోగ కారకాలపై నేరుగా పనిచేసే డ్రగ్ డిస్కవరీపై సెంటర్ ఫర్ సెల్యూలర్ అండ్ మాలిక్యూలర్ బయాలజీ పరిశోధకులు దృష్టి సారించింది. సీనియర్ సైంటిస్ట్ మంజులారెడ్డి, పురాన్ సింగ్ సిజ్వాలీ బృందం డ్రగ్ డిస్కవరీకి అవసరమైన నూతన టూల్స్ డెవలప్ చేస్తోంది. అధునాతన లక్ష్యిత ఔషధ ఆవిష్కరణ విధానంలో వ్యాధి కారకాలపై నేరుగా పనిచేసి, వాటిని చిన్నాభిన్నం చేసే ఔషధ గుణాలు కలిగిన మందులను కనుగొనేందుకు పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. రోగి శరీరంలో వ్యాధి కారకాలు ఏ విధంగా మనుగడ సాగిస్తున్నాయనే విషయాన్ని తెలుసుకుంటూనే, మనుగడ కోసం బ్యాక్టీరియా, వైరస్, ప్రోటోజువా వంటి వ్యాధి కారకాలు ఎలా మార్పు చెందుతున్నాయనే విషయాన్ని పరిశీలిస్తున్నారు. డ్రగ్ ఇచ్చిన సమయంలో ఏ విధంగా ప్రతిస్పందనలు వస్తున్నాయనే విషయాన్ని తెలుసుకుంటున్నారు. ప్రస్తుతం మార్కెట్లో వేల కొలది యాంటీ బయాటిక్స్ వంటి మందులు ఉన్నాయి.
కాని, వీటి పనితీరు ఆశించిన స్థాయిలో లేదనే వాదనలున్నాయి. దీంతో అధిక మోతాదులో డ్రగ్ తీసుకుంటే కానీ మందులు పనిచేసే పరిస్థితి లేకుండా పోతుంది. దీంతో మార్కెట్లో యాంటీ బయాటిక్స్ వంటి రోగ నిరోధక మందుల వినియోగం పెరుగుతుండగా, వాటి వలన కలిగే ప్రతికూల ప్రభావం కూడా భారీగానే ఉంటుంది. ఇలాంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని సీసీఎంబీ పరిశోధకులు రోగ కారకాలపై నేరుగా పనిచేసే మందుల తయారీపై దృష్టి సారించారు. 2019లో జరిగిన అధ్యయనం ప్రకారం, ప్రపంచ వ్యాప్తంగా యాంటీ బయాటిక్స్ తయారీలో భారత్ ముందంజలో ఉండగా, వీటి వినియోగంలోనూ భారతే అతి పెద్ద వినియోగదారుడిగా ఉంది. ఈ క్రమంలో వ్యాధులకు కారణమైన బ్యాక్టీరియాను హరించడంలో మందులు విఫలమవుతూనే ఉన్నాయని తేలింది. బ్యాక్టీరియా కారణంగా 4.9 మిలియన్ల మంది మృత్యువాత పడినట్లుగా వెల్లడైంది. అంటే, టార్గెటెడ్ డ్రగ్ డిస్కవరీ విధానం భవిష్యత్తులో అత్యంత కీలకంగా మారనుందని సీసీఎంబీ వర్గాలు చెబుతున్నాయి.