హైదరాబాద్, మే 2 (నమస్తే తెలంగాణ): శంషాబాద్ విమానాశ్రయంలో ఆదివారం అర్ధరాత్రి డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు రూ.80 కోట్లు విలువచేసే 8 కిలోల కొకైన్ పట్టుకున్నారు. కేప్టౌన్ నుంచి దుబాయ్ మీదుగా హైదరాబాద్కు వ్యాపార వీసాపై వచ్చిన టాంజానియా జాతీయుడు, అంగోలా నుంచి టూరిస్ట్ వీసాపై హైదరాబాద్ వచ్చిన మహిళా ప్రయాణికురాలిని విశ్వసనీయ సమాచారంతో తనిఖీ చేశారు. ఇద్దరి బ్యాగుల్లో 4 కిలోల చొప్పున కొకైన్ బయటపడింది. విమాన ప్రయాణాలపై పరిమితులు తొలగిపోయి, ప్రయాణికుల రద్దీ పెరగడంతో డ్రగ్స్ స్మగ్లింగ్ ఘటనలు పెరుగుతున్నాయని డీఆర్ఐ అధికారులు తెలిపారు.
అప్రమత్తమై వరస తనిఖీలు నిర్వహిస్తున్నామని, గత నాలుగు నెలల్లో ఔషధ మాత్రల రూపంలో రవాణా చేస్తున్న కొకైన్ పట్టుబడిన ఘటనలు పెరిగాయని పేర్కొన్నారు. 2022 మార్చిలో ముంబైలో రెండు, ఏప్రిల్లో హైదరాబాద్, బెంగళూరులో ఒక్కొక్కటి చొప్పున ఈ తరహా కేసులు నమోదు చేశామన్నారు. 2021 జనవరి నుంచి ఇప్పటివరకు దాదాపు 350 కిలోల కంటే ఎక్కువ కొకైన్ను స్వాధీనం చేసుకున్నామని, దాని విలువ రూ.3500 కోట్లు ఉంటుందని ఒక ప్రకటనలో తెలిపారు.