ఆదిలాబాద్, సెప్టెంబర్ 5(నమస్తే తెలంగాణ): ప్రజల ఆదరణ కోల్పోయిన కాంగ్రెస్ నాయకులు.. ప్రలోభాలతో ఓటర్లను మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. మంగళవారం ఆదిలాబాద్ జిల్లాలో పోలీసులు ఓ గోదాములో నిల్వ ఉంచిన 2 వేల ప్రెజర్ కుక్కర్లను స్వాధీనం చేసుకోవడంతో ఈ విషయం బయటపడింది. కాంగ్రెస్నుంచి ఆదిలాబాద్ టికెట్ ఆశిస్తున్న కంది శ్రీనివాస్రెడ్డి ఫొటోలు ప్యాకింగ్ బాక్సులపై ముద్రించి ఉండటంతో అనుమానాలకు తావిస్తున్నది.
పట్టణంలోని కుమార్పేట ప్రాంతంలో ఓ గోదాములో సరైన పత్రాలు లేకుండా కొన్ని వస్తువులు నిల్వచేసి ఉన్నట్టు వన్టౌన్ పోలీసులకు సమాచారం అందింది. సీఐ సత్యనారాయణ ఆధ్వర్యంలో పోలీసులు గోదాముపై దాడి చేశారు. కుక్కర్లను స్వాధీనం చేసుకున్నారు. అవి ఎక్కడి నుంచి వచ్చాయి? పత్రాలు ఉన్నాయా? లేవా? తెలుసుకునేందుకు కమర్షియల్ ట్యాక్స్ అధికారులకు లేఖ రాస్తున్నామని, వారు విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటారని సీఐ సత్యనారాయణ తెలిపారు.