హుజూరాబాద్ టౌన్, జూలై 17: బీజేపీ నాయకుడు ఈటల రాజేందర్ సతీమణి జమునారెడ్డికి కరీంనగర్ జిల్లా హుజూరాబాద్లో చేదు అనుభవం ఎదురైంది. శనివారం సాయంత్రం హుజూరాబాద్లోని గ్యాస్ గోదాం ఏరియాలో ఇంటింటి ప్రచారం చేస్తుండగా ఓ వ్యక్తి గతంలో తనకు జరిగిన అన్యాయంపై ప్రశ్నించాడు. ఇటీవల ఈటల పంపిణీ చేసిన గోడ గడియారాన్ని నేలకేసి బాది ఆగ్రహం వ్యక్తంచేశాడు. ఓట్లు అడిగేందుకు వస్తే తరిమికొడతానని హెచ్చరించాడు. వివరాలు ఇలా.. పట్టణానికి చెందిన టేకుమట్ల శ్రీనివాస్-సునీత దంపతుల కొడుకు వెంకటేశ్ సాంఘిక సంక్షేమ శాఖ వసతి గృహంలో ఉంటూ చదువుకునేవాడు. 2017 సెప్టెంబర్లో మంచిర్యాల జిల్లా జైపూర్లో రాష్ట్ర స్థాయి క్రీడాపోటీల్లో పాల్గొనేందుకు వెళ్లి, ప్రమాదవశాత్తు మృతి చెందాడు. ఆ సమయంలో శ్రీనివాస్ దంపతులను అప్పుడు మంత్రి గా ఉన్న ఈటల పరామర్శించారు. ప్రభుత్వపరంగా రూ.5లక్షలు ఇప్పిస్తానని మాట ఇచ్చారు. ఏడాది గడిచాక రూ.లక్ష మాత్ర మే ఇచ్చారు. శనివారం ప్రచారానికి వచ్చిన జమునారెడ్డిని ఇదే అంశంపై బాధితుడు నిలదీశాడు. ‘నా కొడుకు చనిపోతే రూ.5 లక్షలు ఇచ్చి ఆదుకుంటామని నమ్మించి.. రూ.లక్షతోనే చేతులు దులుపుకొన్నారు’ అని మండిపడ్డాడు. ‘పాతవి మరిచిపో. ఇప్పుడు మాత్రం మళ్లీ మాకే ఓటు వేయి’ అని జమునారెడ్డితో వచ్చిన పలువురు నచ్చజెప్పేందుకు ప్రయత్నించగా శ్రీనివాస్ ఆవేశానికి లోనయ్యాడు. ‘90రూపాయల గడియారం ఇచ్చి ఓటు ఆడుగుతారా?’ అంటూ ఫైరయ్యాడు. కార్యకర్తలు జమునారెడ్డిని అక్కడి నుంచి తీసుకువెళ్లారు.