CM KCR | తొర్రూరు, మార్చి 23: ‘ధైర్యం చెడొద్దు.. నేనున్నా.. మీకు అండగా నిలుద్దామనే వచ్చా.. వడగళ్ల వానతో దెబ్బతిన్న పంటలను చూసి ఆత్మైస్థెర్యం కోల్పోవద్దు. అన్ని పంటలకు ఎకరాకు రూ.10 వేల చొప్పున పరిహారం ఇస్తం. ఇది రైతుకిచ్చే నష్టపరిహారంగా భావించకండి. సహాయ పునరావాసంగా గుర్తించండి’ అంటూ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు రైతుల్లో భరోసా నింపారు. మహబూబాబాద్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం పెద్దవంగర మండలం రెడ్డికుంటతండాలో అకాల వర్షాలు, వడగళ్లతో దెబ్బతిన్న మక్క, మిర్చి, మామిడి పంటలను పరిశీలించి పలువురు రైతులతో మాట్లాడారు. ఆయా రైతులతో ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన సంభాషణ యథాతథంగా..
సీఎం కేసీఆర్: ఇండ్ల ఏమైన ఎల్తదా.. ఎన్ని ఎకరాలు వేసినవ్?
రైతు చిన్న సోమ్లానాయక్: మూడు ఎకరాలు సార్.. గింజ కూడా మొలవకుండా రాళ్ల దెబ్బలు తాకి చేను ఒరిగి పోయె, చేతికి ఏమీ రాదు. ఏం చెయ్యాలె సారు.
ముఖ్యమంత్రి: ఇట్ల ధైర్యం చెడొద్దనే చెప్పేది. అన్నీ చూసే ఖమ్మంలో చెప్పా. ఏ పంటైనా సరే ఎకరానికి పదివేలు తక్షణం నష్ట పరిహారం ఇస్తామని. ఇంతకుముందు ఏదో రెండు, మూడు వేలు ఇచ్చేటోళ్లు. అదీ సక్కగ ఇచ్చేది లేదు. కేంద్రం నుంచి పైసా ఇస్తలేరు. మన ఖజానా నుంచే వెంటనే ఎకరానికి రూ.10 వేలు ఇవ్వాలని చెప్పా. మీ కలెక్టర్లు చూసుకుంటరు. మళ్లో పంటకు సిద్ధంకండి.
చిన్న సోమ్లానాయక్: మీ దయ సారు.
ముఖ్యమంత్రి: మీ జిల్లాలో కౌలు రైతులు ఎంతమంది ఉంటారు?
మంత్రులు దయాకర్రావు, సత్యవతి: 30 శాతం ఉండొచ్చు సార్.
ముఖ్యమంత్రి: అంతమంది ఉండరులే.
మంత్రులు: ఊర్లో లేకుండా ఉద్యోగాలకు, రకరకాల పనులకు సిటీలకు పోయినవాళ్లు వాళ్ల భూములను కౌళ్లకు ఇస్తున్నారు.
ముఖ్యమంత్రి: ఎంత ఇచ్చినా ఊరికి ఐదుగురో, ఆరుగురో, మహా అయితే పది మంది ఉంటారు కావొచ్చు ఏమంటవు? (అంటూ రైతు చిన్నసోమ్లాను అడిగారు.)
చిన్న సోమ్లానాయక్: అవును సారు.. ఇప్పుడు అందరూ సొంతానికి చేసుకుంటున్నరు.
( అని సమాధానమివ్వగా సీఎం కేసీఆర్ అటు నుంచి మిర్చి తోట వైపు అడుగులు వేశారు.)
ముఖ్యమంత్రి: ఏపాటి ఏసినవ్ మిరపకాయ.. పెట్టుబడి ఎంత పెట్టినవ్?
మిర్చి రైతు జాటోత్ సోమానాయక్: రెండెకరాలు ఏసిన సార్. వడగళ్లతో మిర్చి, మక్క, వరి మొత్తం పోయినయి సార్. ఈ మిర్చికి ఎకరానికి లక్షా 50 వేలు పెట్టిబడి పెట్టిన.
ముఖ్యమంత్రి: అంత ఎందుకైంది?
రైతు జాటోత్ సోమానాయక్: మిరప చేనుకు వైరస్ వచ్చే సరికి ఫుల్లుగ పురుగుమందులు కొట్టాల్సి వచ్చింది. పైసలు ఎక్కువైనయ్ సార్.. ఇన్ని రోజులు మంచి కరెంటు బ్రహ్మాండంగ ఇస్తున్నరు. మోటర్లు చక్కగ నడుస్తున్నయ్. ట్రాన్స్ఫ్మార్లర్లు, స్టాటర్లు బాగున్నయ్. రైతుబంధు సాయం ఇస్తిరి. చేన్లకు కడుపునిండా నీళ్లు అందినయి. ఏ ఇబ్బందీ లేకుండ ఉన్నం కానీ ఈ వడగళ్ల వాన ఇట్ట ముంచింది.
ముఖ్యమంత్రి: అదే.. ధైర్యం చెడొద్దని చెప్పేది. ఇటువంటి టైములోనే ధీమాగా ఉండాలే.. అందుకే నేను వచ్చా. కేంద్రం ఇవ్వకున్నా మన ఖజానా నుంచే ఎకరానికి రూ.10 వేలు ఇస్తం. మరో పంటకు సిద్ధంకండి. వెంటనే సహాయం అందేలా అధికారులకు చెప్తున్నాం. మీరు ధైర్యంగా ఉంటే నేను ధైర్యంగా ఉంటా.. (అంటూ వడగళ్లతో దెబ్బతిన్న మామిడి తోట వైపు సాగారు.)
ముఖ్యమంత్రి: ఎవరిదీ తోట.. ఎన్ని ఎకరాలు?
రైతు నెహ్రూనాయక్: మా అన్నదమ్ముల పొత్తులో 20 ఎకరాల తోట సార్. ఈ ఏడాది కాయ మంచి కాతకు వచ్చింది. కౌలుకిచ్చాం.. వడగళ్ల వానతో సగం కాయలు నేల రాలినయ్. వారం రోజుల్లో మొదటి కాయ కోతకు వస్తుందని చూస్తుండగా రాళ్లవాన దెబ్బతీసింది. ఇప్పటికీ రాళ్ల దెబ్బలు తాకిన కాయలు రోజూ రాలిపోతున్నాయి. 80 శాతం నష్టం వస్తుంది సార్.. అని చెప్పడంతో ‘ఎకరానికి రూ.10 వేల పరిహారం ఇచ్చేలా నిర్ణయం తీసుకున్నాం’ (అని చెప్తూ సీఎం కేసీఆర్ ముందుకు సాగారు. అనంతరం వ్యవసాయ, ఉద్యానశాఖ అధికారులు ఏర్పాటుచేసిన ఫొటో ప్రదర్శనను తిలకించారు.)
వడగళ్ల వాన తెచ్చిపెట్టిన నష్టం నుంచి రైతాంగాన్ని ఆదుకోవాలనే సంకల్పంతో దెబ్బతిన్న పంటలకు ఎకరాకు రూ.10 వేల చొప్పున పరిహారం అందజేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించగానే ఒక్కసారిగా ప్రాంగణంలోని రైతులంతా ‘కేసీఆర్ జిందాబాద్’ అంటూ నినాదాలు చేశారు. ‘కౌలు రైతులను కూడా ఆదుకోండి. వారు కూడా పెట్టుబడి పెట్టి ఉన్నారు. పరిహారం పొందే రైతులు వారికి కొంత ఇచ్చి ఆర్థిక భారం నుంచి ఊరట కలిగించాలి. మీతో కలెక్టర్లు పిలిచి మాట్లాడుతారు’ అంటూ సీఎం కేసీఆర్ కౌలు రైతుల్లో కూడా ఆత్మైస్థెర్యాన్ని నింపారు. దెబ్బతిన్న పంటలను పరిశీలిస్తున్న సందర్భంలో రైతులు జాటోతు చిన్న సోమ్లా, జాటోతు సోమాని, జాటోతు నెహ్రూనాయక్.. వీరు ముగ్గురు కూడా రైతుబంధు, రైతుబీమా, ఉచిత విద్యుత్తు, సాగునీరు విషయాలను కేసీఆర్ ముందు ప్రస్తావించి, రాష్ట్రంలో వ్యవసాయం పండుగలా మారిందని, ఎకరానికి రూ.10 వేలు పరిహారం ఇస్తామని ప్రకటించి రైతుకు భారీ ఉపశమనం కలిగించారని సంతోషం వ్యక్తం చేయడం విశేషం.