హైదరాబాద్, మే 22(నమస్తే తెలంగాణ): ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో రైతుల కోసం శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా విత్తన మేళా నిర్వహించనున్నట్టు పరిశోధనా సంచాలకుడు డాక్టర్ రఘురామిరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. నాణ్యమైన విత్తనాలను అందించాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేయనున్న ఈ మేళాను హైదరాబాద్ రాజేంద్రనగర్లోని యూనివర్సిటీ ఆడిటోరియంలో నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు.
అదే రోజున విశ్వవిద్యాలయ పరిధిలోని జగిత్యాల, పాలెం, వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానాల్లో, అన్ని కృషి విజ్ఞాన కేంద్రాల్లో విత్తన మేళాలు నిర్వహిస్తామని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా జరిగే ఈ మేళాల్లో 16 పంటల్లో 67 రకాలకు చెందిన దాదాపు 12 వేల క్వింటాళ్ల విత్తనాలను రైతులకు అమ్మకానికి అందుబాటులో ఉంచనున్నట్టు పేర్కొన్నారు. ఈ మేళాలో వర్సిటీలో రూపొందించిన వివిధ వంగడాలను ఉంచుతామని తెలిపారు. వరిలో 27 రకాలు ఉన్నాయని, మెట్ట, అపరాలతో పాటు గడ్డి విత్తనాలనూ అందుబాటులో ఉంచనున్నట్టు డాక్టర్ రఘురామిరెడ్డి తెలిపారు.