అగ్నిపథ్తో మా భవిష్యత్తు అంధకారం
మా ఆక్రోశం కేంద్ర ప్రభుత్వానికి తెలియజేయాలనుకున్నాం
ఆందోళన వెనుక కుట్ర ఏమీ లేదు
ఆర్మీ ఉద్యోగార్థుల ఆడియోలు వైరల్
పోలీసుల అదుపులో 46 మంది
19 మందికి రైల్వేకోర్టు రిమాండ్
హైదరాబాద్ సిటీబ్యూరో/మారేడుపల్లి, జూన్18 (నమస్తే తెలంగాణ): కేంద్ర ప్రభుత్వం అనాలోచితంగా తీసుకున్న అగ్నిపథ్ నిర్ణయంతో తమ భవిష్యత్తు ఖతమయ్యిందనే ఉద్యోగార్థుల ఆక్రోశమే సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో చోటుచేసుకున్న విధ్వంసానికి ప్రధాన కారణమని రైల్వే పోలీసులు, హైదరాబాద్ పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో స్పష్టమైంది. శుక్రవారంనాటి ఘటనకు సంబంధించి ఇప్పటివరకు 46 మందిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ‘ఫిజికల్, మెడికల్ పరీక్షలు పూర్తయ్యి రెండేండ్లు అయ్యింది. ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నాం. ఆకలి మంటతో ఉన్నాం. ఇంట్లోవాళ్లు మాపై కొండంత ఆశలు పెట్టుకున్నారు. ఫైనల్ పరీక్షను ఇప్పటికి పదిసార్లు వాయిదా వేస్తూ వచ్చారు. ఇప్పుడు అగ్నిపథ్తో ఆ ఆశలన్నీ బూడిదయ్యాయి. వయసు పరిమితి కారణంగా అర్హతను కోల్పోయాం. మేమెట్ల బతకాలె? మా బాధను కేంద్రానికి తెలియజేయాలనే నిరసనకు దిగాం. మా ఆందోళన వెనుక కుట్ర ఏమీ లేదు.
ఆక్రోశం, ఆవేదన మాత్రమే ఉన్నాయి’ అని యువకులు దర్యాప్తు అధికారులకు వెల్లడించినట్లు సమాచారం. ఉద్యోగార్థుల మొబైల్ ఫోన్ల నుంచి వాట్సాప్ గ్రూపుల్లో మాట్లాడుకున్న 12 ఆడియోలను పోలీసులు సేకరించారు. అవి బయటకు లీక్ కావడంతో వైరల్గా మారాయి. హకీంపేట్ సోల్జర్స్, 17/6, సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ పేరిట వాట్సాప్ గ్రూపుల ద్వారా ఆర్మీ ఉద్యోగార్థులు ఆందోళనకు సంబంధించి సమాచారం చేరవేసుకున్నారని దర్యాప్తు బృందాలు గుర్తించాయి. ఆదిలాబాద్ నుంచి తిరుపతికి వెళ్లే కృష్ణా ఎక్స్ప్రెస్లో దాదాపు 300 మంది యువకులు శుక్రవారం ఉదయం సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ చేరుకున్నారని, వారికి రెండురోజుల క్రితమే నగరానికి చేరుకున్న మరో 300 మంది జతకలిశారని పోలీసులు పేర్కొంటున్నారు.
19 మందికి 14 రోజుల రిమాండ్
సికింద్రాబాద్ ఘటనలో 19 మంది యువకులను ఆర్పీఎఫ్ పోలీసులు శనివారం రైల్వేకోర్టులో హాజరుపర్చారు. న్యాయమూర్తి వారికి 14రోజుల రిమాండ్ను విధించారు. హైదరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలోని గోపాలపురం పీఎస్లో ఉద్యోగార్థులపై రెండు కేసులు నమోదయ్యాయి. దాదాపు 29 మందిని గుర్తించినట్లు సమాచారం. సికింద్రాబాద్ స్టేషన్ వద్ద బస్సుల ధ్వంసానికి సంబంధించి మరో రెండు కేసులు కూడా నమోదయ్యాయి. అదుపులోకి తీసుకున్న అభ్యర్థుల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా విధ్వంసానికి పాల్పడిన 200మందిని గుర్తించేందుకు ప్రత్యేక బృందాలు ప్రయత్నిస్తున్నాయి.