కంటోన్మెంట్, మార్చి 22: ఉజ్వల భారత్, మేకిన్ ఇండియా అంటూ నిత్యం ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తున్న కేంద్ర ప్రభుత్వ పెద్దలకు దేశంలోని కంటోన్మెంట్ బోర్డుల దుస్థితి కనిపించడం లేదు. దీంతో ఇప్పటికే దాదాపు 54 కంటోన్మెంట్ బోర్డులు నిధుల లేమితో దివాలా స్థితికి చేరుకున్నాయి. వాటిలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు ముందు వరుసలో ఉన్నది. ఈ నేపథ్యంలో కొత్త నియామకాలు చేపట్టవద్దంటూ కేంద్రం ఈ నెల మొదటి వారంలో ఆయా బోర్డులకు ఉత్తర్వులు జారీచేసింది. వాటి ఆర్థిక పరిస్థితి దారుణంగా దిగజారినట్టు ఆ ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొన్న రక్షణ శాఖ.. కనీసం కంటోన్మెంట్ ప్రాంతాల్లో రోడ్లకు మరమ్మతులు కూడా చేయించడం లేదు. దీంతో ఆయా ప్రాంతాల్లో నిత్యం ప్రమాదాలు జరిగి ఎంతో మంది క్షతగాత్రులవుతున్నారు.
సర్వీస్ చార్జీల రూపేణా సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డుకు కేంద్రం నుంచి సుమారు రూ.750 కోట్లు రావాల్సి ఉన్నది. ఇటీవల పలు కంటోన్మెంట్లకు నిధులు కేటాయించిన కేంద్రం.. సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డుకు మాత్రం పైసా కూడా విడుదల చేయలేదు. దీంతో ఉద్యోగులకు కనీసం జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి నెలకొన్నది. దీనిపై నోరు మెదపని బీజేపీ నేతలు.. సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డులో అభివృద్ధి లేదంటూ గగ్గోలు పెడుతుండటం గమనార్హం.
కళ్లుండీ చూడలేని కబోదుల్లా..
దేశ భవిష్యత్తుకు పునాదులు వేస్తున్నామని నిత్యం ఊదరగొడుతున్న కేంద్ర ప్రభుత్వ పెద్దలు పూర్తిగా తమ పరిధిలోనే ఉన్న కంటోన్మెంట్లను ఏమాత్రం పట్టించుకోవడం లేదు. వాటి పరిస్థితి నానాటికీ చేయిదాటిపోతున్నా కళ్లుండి చూడలేని కబోదుల్లా వ్యవహరిస్తున్నారు. ఆ కంటోన్మెంట్లను ఆదుకునేందుకు కనీస చర్యలైనా చేపట్టడం లేదు. పైపెచ్చు ఆయా బోర్డుల పరిధిలో అభివృద్ధి పనులను తగ్గించుకోవాలని, మౌలిక వసతులపై దృష్టి కేంద్రీకరించాల్సిన అవసరం లేదని ఆదేశించినట్టు విశ్వసనీయంగా తెలిసింది. దీంతో ఆయా కంటోన్మెంట్లలో రోడ్లు, డ్రైనేజీల మరమ్మతు పనులు పూర్తిగా పడకేశాయి. ఈ క్రమంలో కంటోన్మెంట్ బోర్డులకు ఎన్నికలు నిర్వహించాలని ఫిబ్రవరి 17న గెజిట్ నోటిఫికేషన్ను విడుదల చేసిన రక్షణ శాఖ.. సరిగ్గా నెల రోజుల్లోనే ఆ ఎన్నికలను రద్దు చేసింది. ఈ మేరకు ఈ నెల 17న మరో నోటిఫికేషన్ను జారీ చేసింది. బీజేపీ పట్ల కంటోన్మెంట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్నట్టు ఇంటెలిజెన్స్ నివేదిక స్పష్టం చేయడమే ఇందుకు కారణమని స్పష్టమవుతున్నది.
ఓటమి భయంతోనే ఎన్నికల రద్దు
కేంద్రంలోని బీజేపీ సర్కారు ప్రజల మద్దతును కోల్పోయింది. కంటోన్మెంట్లలో మౌలిక వసతులను కల్పించలేక ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటున్నది. అందుకే ఆయా బోర్డుల పరిధిలో ఇష్టానుసారంగా ఓట్లను తొలగించింది. అయినా ఓటమి భయం వెంటాడుతుండటంతో ఏకంగా ఎన్నికలనే రద్దు చేసింది. ప్రజాస్వామ్యంపై నమ్మకంలేని బీజేపీ నేతలు ప్రజల ముందుకు రాలేకనే ఎన్నికలకు జంకుతున్నారు. దేశవ్యాప్తంగా పలు కంటోన్మెంట్లు దివాలా తీయడంపై మోదీ సర్కారు ప్రజలకు సమాధానం చెప్పితీరాల్సిందే.
– మన్నె క్రిషాంక్, చైర్మన్, రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ