హైదరాబాద్: మహంకాళి అమ్మవారి విగ్రహం తప్పిస్తున్నారనే ప్రచారం అవాస్తవమని, అమ్మవారి విషయంలో రాజకీయాలు చేయడం సరికాదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. జులై 17, 18 తేదీల్లో ఘనంగా మహంకాళి జాతర (Mahankali Jatara) ఉత్సవాలు నిర్వహిస్తామన్నారు. బోనాల ఉత్సవాలను రాష్ట్ర పండుగగా ప్రకటించి ఘనంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. సికింద్రాబాద్లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పర్యటించారు. ఎంజీ రోడ్డులో గాంధీ విగ్రహం వద్ద అభివృద్ధి పనులను పరీశించారు. అనంతరం ఉజ్జయిని ఆలయ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా ప్రతిపక్షాలు వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. ఆలయంలో మూల విరాట్ మార్పు ఆలోచన లేదని స్పష్టం చేశారు. అవాస్తవాలు ప్రచారం చేసేవారిని అమ్మవారే చూసుకుంటారని వెల్లడించారు.
కొందరు కావాలనే ఆలయ ప్రతిష్ఠకు భంగం కలిగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎంజీ రోడ్డులో గాంధీ విగ్రహం తొలగింపు ప్రచారం అవాస్తవమని కొట్టిపారేశారు. విగ్రహం తొలగిస్తున్నారంటూ ప్రతిపక్షాలు రోడ్లెక్కడం విడ్డూరంగా ఉందని చెప్పారు. గాంధీ విగ్రహ పరిసర ప్రాంతాల్లో సుందరీకరణ చేస్తున్నామన్నారు.